తెలంగాణ అడిగేవారమా, మమ్మల్ని గెలిపించేవారా, కిరణ్ రెడ్డి మాటేమిటి: కెటిఆర్
మహబూబ్ నగర్: నాడు సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం చిత్తూరు జిల్లాకు రూ.7వేల కోట్లను నీటి ప్రాజెక్టుల కోసం ఆమోదించుకున్నారని, అప్పుడు మాట్లాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణ వారికి రూ.30వేల కోట్లతో నీరు ఇస్తామంటే మాట్లాడుతున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో వాటర్ గ్రిడ్ పనులకు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.
గత సిఎంలు దత్తత తీసుకొని చేసిందేం లేదు
పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ గ్రిడ్కు శంకుస్థాపన చేశామన్నారు. పాలమూరు వేదికగా ఈ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. సమైక్య పాలనలో పాలమూరు జిల్లా వివక్షకు గురైందన్నారు.
లక్షల మంది వలసలు పోతుంటే గత పాలకులు ఏం చేశారో చెప్పాలన్నారు. గతంలో సీఎంలు ఈ జిల్లాను దత్తత తీసుకున్న జిల్లా రాత మారలేదన్నారు. ఎన్నికల ముందు మంత్రులు అరచేతిలో వైకుంఠం చూపించారని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని చెప్పిన దమ్మున్న సీఎం కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ ఓట్ల కోసం మాయమాటలు చెప్పే వ్యక్తి కాదన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలకు తాము జవాబుదారులం కాదన్నారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను పట్టించుకోమన్నారు. గత ప్రభుత్వాల మంత్రులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.
పట్టించుకోం
ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు పట్టించుకునే సమయం తమకు, ప్రజలకు లేదన్నారు. వాటర్ గ్రిడ్ పథకానికి రూ.30వేల కోట్లు అవసరమా అని ఓ కాంగ్రెస్ నేత ప్రశ్నిస్తున్నారని.. మరి సమైక్య ఏపీలో కిరణ్ తన జిల్లా చిత్తూరుకు రూ.7వేల కోట్లు ఆమోదం చేయించుకున్నప్పుడు మాట్లాడలేదేం అన్నారు.
ఒక్క జిల్లాకే రూ.7వేల కోట్లు అయితే, 119 నియోజవకర్గాలు ఉన్న తెలంగాణకు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తమకు ఈ రోజే తెలిసినట్లు ప్రతిపక్షాలు రోడ్డెక్కడం విడ్డూరమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి వారు నిన్నటిదాకా మంత్రి పదవులు అనుభవించారన్నారు.
వాళ్లు అప్పుడే సమస్యలు పరిష్కరించు ఉంటే ప్రజలు తెలంగాణను అడిగేవారా, మాకు అధికారం ఇచ్చేవారా అని ప్రశ్నించారు. మేం బంగారు తెలంగాణ ఇచ్చాం, మీరు వజ్రాల తెలంగాణ చేయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలా చెప్పేందుకు సిగ్గుందా అన్నారు.
విపక్షాలు గతంలో ధర్నాలు చేయలేదు, రోడ్డెక్కలేదని, ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల పైన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని కూడా మాట్లాడుతున్నారన్నారు.
65 ఏళ్ల గబ్బు ఏడాదికే పోతుందా
తెలంగాణకు 65 ఏళ్లు గబ్బు ఏడాదికే వదిలిపోతుందా అని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణలోనే ఇబ్బందులు లేవని, అంతటా ఉన్నాయన్నారు. ఐదేళ్లలో మేం చాలా చేసి చూపిస్తామన్నారు. విపక్షాల పసలేని ఆరోపణలు పట్టించుకోమన్నారు.
మేం పని చేయకుంటే ఇంట్లో కూర్చుండబెడతారు
తెలంగాణ వచ్చాక మంచి పాలన కోసం కెసిఆర్ చేతిలో ప్రజలు ప్రభుత్వాన్ని పెట్టారని చెప్పారు. మేం పని చేయకుంటే ఐదేళ్ల తర్వాత అదే ప్రజలు మమ్మల్ని ఇంట్లో కూర్చుండబెడతారన్నారు. విపక్షాలు అనవసరంగా రోడ్ల పైకి రావొద్దన్నారు. వాటిని మేం పట్టించుకోమన్నారు. విపక్షాలది సొల్లు పురాణం అన్నారు.
తెలంగాణకు కృష్ణా, గోదావరి రూపంలో రెండు జీవనదులు ఉన్నాయని చెప్పారు. కెసిఆర్ 18 ఏళ్ల క్రితమే... ఎమ్మెల్యేగా సిద్దిపేటకు 180 గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు ఇచ్చారన్నారు. పాలమూరును, తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు.
ప్రజలకు మంచి రోజు: లక్ష్మా రెడ్డి
అంతకుముందు మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు జిల్లా ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు.
సమైక్య పాలనలో సాగునీరు లేక జిల్లా ప్రజలు వలసలు పోయారని, సమైక్య పాలకులు బలవంతంగా నీటిని సీమాంధ్రకు తరలించుకుపోతున్నా మాట్లాడని నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.