ఓ పత్రిక ఓనర్ని శపించావు.. మరి ఒవైసీ వ్యాఖ్యల పట్ల ఏమంటావ్..? కేసీఆర్ ను ప్రశ్నించిన రాములమ్మ..!
హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వసతులను ఉపయోగించుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన ఏ ఒక్కరూ పడకూడదని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు, కరోనా బాదితులకు కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తించకుండా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వంటి నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు సంయమనం పాటిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ప్రశ్నిస్తున్నారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యల పట్ల ఎందుకు స్పందించరు..? సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించిన విజయశాంతి..
కరోనా వైరస్ పై అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల సీరియస్ గా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అసలు ఎంఐఎం పార్టీకి అంతటి ప్రదాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాములమ్మ నిలదీస్తున్నారు. కరోనా మహమ్మారి పై చేస్తున్న యుద్దంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి నెట్టబడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా అడుగు ముందుకేస్తున్న తరుణంలో ఒవైసీ అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం దేనికి సంకేతమని విజయశాంతి ప్రశ్నిస్తున్నారు. ఒవైసీ వ్యాఖ్యల పట్ల ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
కరోనా వైరస్ విజృంబిస్తున్న సమయం ఇది.. కలత చెందిస్తున్న ఒవైసీ వ్యాఖ్యలన్న రాములమ్మ..
కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో, కొన్ని లోపాలున్నా వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ మధ్య అనేక ప్రసార మాద్యమాల్లో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఓ పత్రిక యజమానికి కరోనా వ్యాధి సోకాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శాపం పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, విజయశాంతి గుర్తు చేసారు.
తప్పుడు కథనాలని పత్రిక యజమానిని శపించావ్.. ఇప్పుడు ఒవైసీని కూడా శపించాలంటున్న లేడీ బచ్చన్..
వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా వ్యాది రావాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శాపం పెడితే, మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని విజయశాంతి ఎద్దేవా చేసారు. గాంధీ ఆసుపత్రి జైలు లాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ కు బహుశా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా చంద్రశేఖర్ రావుగారు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవనే ధీమా అక్బరుద్దీన్ లో ఉండి ఉండొచ్చని విజయశాంతి తెలిపారు.
Recommended Video
సీఆర్ మౌనం వీడాలి.. అసద్ కు కౌంటర్ ఇవ్వాలని రాములమ్మ డిమాండ్..
అలా కాకుండా తమకు ఈ శాపాలు తగలవని, తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ ఒవైసీ భావించి ఉండొచ్చని రాములమ్మ చెప్పుకొస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్ పై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శాపం పెడతారా..? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే అంశం పట్ల ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని రాములమ్మ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎంఐఎం పట్ల సానుకూల ధోరణి చూపించడం ఎంతవరకు సమంజపమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి సానుకూల వైఖరని ఆసరాగా చేసుకుని ఎంఐఎం నేతలు మరింత రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.