స్పై కెమెరాలపై నటి సన అసంతృప్తి: సమంత, మెహ్రీన్లు ఆవేదన చెందారని వ్యాఖ్య
హైదరాబాద్: మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న రహస్య కెమెరాల విక్రయాలపై (స్పై కెమెరాలు) నియంత్రణ ఉండాలని ప్రముఖ సినీ నటి సన అభిప్రాయపడ్డారు. యాంటీ రెడ్ ఐ పేరుతో చేపట్టిన ఉద్యమానికి సంబంధించిన వివరాలను ఆమె ఆదివారం వెల్లడించారు.
మహిళలను రహస్యంగా చిత్రీకరించే కెమెరాలను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళలను సమిధలుగా చేస్తున్నారన్నారు. స్పై కెమెరాల విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు
విచ్చలవిడిగా అమ్ముడవుతున్న స్పై కెమెరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని సన అన్నారు. ఎక్కడకు వెళ్లినా స్పై కెమెరాల బాధ తప్పడం లేదని, స్వయంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కూడా చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేశారు.
సమంత, మెహ్రీన్ల మద్దతు
ఆన్లైన్లో స్పై కెమెరాల విక్రయం జోరుగా సాగుతోందని, కేవలం రూ.250కి దొరుకుతున్నాయని సన అన్నారు. వీటి వెనుక మాఫియా ఉందని చెప్పారు. సినీ నటీమణులు సమంత, మెహ్రీన్తో మాట్లాడామని, త్వరలో వారితో పాటు సినీ పరిశ్రమ మద్దతు కూడగడతామన్నారు.
కఠిన చట్టాల కోసం మిస్డ్ కాల్
స్పై కెమెరాల నియంత్రణ, కఠిన చట్టాలు కోరుకునే వారు 80992 59925 మిస్డ్ కాల్ ఇవ్వాలని నటి సన సూచించారు. స్పై కెమెరాల వల్ల కలిగే అనర్థాలపై నటీమణులు సమంత, మెహ్రీన్లు ఎంతో ఆవేదన వ్యక్తం చేసి తమతో కలిసి ఈ మిస్డ్ కాల్ ప్రచారంలో భాగస్వాములు అయ్యారన్నారు. అందరి మద్దతుతో కోటి మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
తుపాకులకు లైసెన్స్ ఇచ్చిన్లుగా
షాంపూ బాటిల్స్, టూత్ బ్రష్ తదితర వస్తువుల్లో సులువుగా స్పై కెమెరాలు పెడుతున్నారని సన అన్నారు. తుపాకులకు లైసెన్సులు ఇచ్చినట్లుగానే రహస్య కెమెరాలకు లైసెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. యాంటీ రెడ్ ఐ పేరుతో మహిళలు, సమాజానికి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెవెన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వరలక్ష్మి, లాయర్ రాధా రాజేశ్వరి తదితరులు అన్నారు. ఈ సందర్భంగా వారు యాంటీ రెడ్ ఐ బ్రోచర్ విడుదల చేశారు.