నా దెబ్బకు కట్టపై పడ్డాడు, అవసరమైతే చస్తా: బాబు మనసులో ఏముందో గజ్వెల్లో చెప్పిన కేసీఆర్
గజ్వెల్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తన సొంత నియోజకవర్గమైన గజ్వెల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మనం అడగ్గానే తెలంగాణను బిస్కట్లా ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు కరకట్ట మీద పడ్డారన్నారు.
ఓట్లు వేసేటప్పుడు గందరగోళానికి గురికావొద్దని, ఆకుపచ్చ తెలంగాణ తన లక్ష్యమని, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను పరులపాలు చేయవద్దని కేసీఆర్ చెప్పారు. కోటి ఎకరాలకు నీరివ్వడం నా యజ్ఞమని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏం జరిగిందో అందరి ముందు ఉందని చెప్పారు. తెలంగాణ త్యాగాలతో వచ్చిందని, ఊరికే రాలేదని చెప్పారు.
కేసీఆర్ పాలన చూసి ఆశ్చర్యపోయా: శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్పై కవిత
తన కీలుబొమ్ము తెలంగాణలో సీఎంగా ఉండాలని చంద్రబాబు కోరిక
కోదాడ సభలో రాహుల్ గాంధీ, చంద్రబాబులు కలిసి ప్రచారం నిర్వహించారని కేసీఆర్ గుర్తు చేశారు. అక్కడ చంద్రబాబు కాంగ్రెస్ సన్నాసులను కూర్చోబెట్టి.. కృష్ణా నదిలో నీళ్లు లేవని, గోదావరి నీళ్లు పంచుకుందామని చెప్పారని, దానికి కాంగ్రెస్ గొర్రెలు తల ఊపాయన్నారు. కోదాడ సభలో కృష్ణానదిలో నీళ్లు లేవంటావా అన్నారు. తెలంగాణలో తాను నడిపే కీలుబొమ్మ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండలాలని చంద్రబాబు కోరుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ ఎవరైనా ఉండవచ్చు కానీ కేసీఆర్ ఉండవద్దనుకుంటున్నారని చెప్పారు.
మన దద్దమ్మగాళ్లు భజన చేశారు
కేసీఆర్ దెబ్బకు అమరావతి కరకట్టకు పోయి పడ్డాడని చంద్రబాబుపై కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రా నుంచి నాయకులు, డబ్బులు తెచ్చి చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవచ్చని చంద్రబాబు ఇక్కడ చెబుతుంటే, మన దద్దమ్మగాళ్లు భజన చేస్తున్నారని కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ ఏపీకి వెళ్లి చంద్రబాబును భుజాలపై మోసుకొచ్చిందని చెప్పారు. మన అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబును మోసుకొస్తారా అన్నారు.
చస్తాను కాను తెలంగాణను మళ్లీ బానిసగా కానివ్వను
అధికారం పోయిందన్న కసి, దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అని, తెలంగాణ నా చేతుల నుంచి పోయింది.. కేసీఆర్ కొరకురాని కొయ్యలా తయారయ్యాడనేది చంద్రబాబు ఉద్దేశ్యమని కేసీఆర్ అన్నారు. అందుకే తనపై ఇద్దరు కలిసి వస్తున్నారని చెప్పారు. మీరు మళ్లీ నాకు అవకాశమిస్తే.. నేను తెలంగాణను మరోసారి అసలు బానిస కానివ్వనని చెప్పారు. అవసరమైతే చస్తా కానీ, బానిసను కానివ్వనని చెప్పారు. మహాకూటమికి అధికారం ఇస్తే చంద్రబాబు బానిసలు పాలిస్తారని అభిప్రాయపడ్డారు. ఈసారి మీరు వారిని ఓటుతో కొట్టాలని చెప్పారు. తెలంగాణ కోసం నేను ఎంత ఆరాటపడ్డానో.. ఎంత ఉద్యమించానో మీకు తెలుసు అని చెప్పారు.
కోమాలోకి వెళ్తారని డాక్టర్లు చెప్పారు
ఆ రోజు నిజాం ఆసుపత్రిలో తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో తన ప్రాణాలపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారని కేసీఆర్ చెప్పారు. కోమాలోకి వెళ్తావని చెప్పినా, తాను వినలేదని అన్నారు. ఆ తర్వాత తన వల్ల తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజలు సంతోషపడ్డారన్నారు. మీ (తెలంగాణ ప్రజలు) మద్దతు లేకుంటే నేను ఏమీ చేయలేనని, మీ మద్దతు కావాలని చెప్పారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందని చెప్పారు.
చంద్రబాబు ఎంత దుర్మార్గుడంటే
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని, ఎంత దుర్మార్గుడు అన్నారు. చట్టం ప్రకారం మనకు రావాల్సిన విద్యుత్ ఇవ్వడని ఆరోపించారు. ఇదే విషయంపై మోడీకి ఫిర్యాదు చేస్తే.. ఆయన చెప్పినా కూడా చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుతాడని చెప్పారు. దేశం మొత్తంలో ఉచిత విద్యుత్ ఇస్తోంది తెలంగాణ మాత్రమే అన్నారు. తన పాలనలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. కంటివెలుగు పుట్టిందే ఎర్రవెల్లి గ్రామంలో అని చెప్పారు.