సీపీఐ నేత నారాయణ ఏం చెప్పారు ... ఏపీ సీఎం జగన్ ను పొగుడుతూనే చురకలంటించారు
ఏపీ సీఎం జగన్ పై సిపిఐ నేత నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని పొగుడుతూనే నారాయణ జగన్ కు చురకలంటించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ప్రధాన కారణం మర్చిపోవద్దని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నారాయణ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తాం అని వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చారని ఇక ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా తీసుకురావలసిన బాధ్యత జగన్ పైన ఉందన్నారు. హోదాపై కేంద్రాన్ని ప్రాధేయ పడడం సరి కాదని జగన్ ప్రత్యేక హోదాను పోరాడి సాధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్సభలో ఎన్ని సీట్లు గెలిచిన కేంద్రంతో పోరాడాలంటే సీట్లు ముఖ్యం కాదని ప్రత్యేక హోదా సాధించాలనే కమిట్మెంట్ ముఖ్యమని ఆయన వివరించారు.
గత ఎన్నికల్లో ఏపీ ఓటర్లు వైసీపీని గెలిపించింది ప్రత్యేక హోదా సాధిస్తారన్న నమ్మకంతో అని, జగన్ కూడా ప్రజలకు అదే హామీ ఇచ్చి గద్దెనెక్కారని పేర్కొన్న సీపీఐ నేత నారాయణ ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించకుండా వదిలేయడం మంచిది కాదని హితవు పలికారు.ప్రస్తుతం జగన్ పనితీరు బావుందని కితాబు ఇస్తూనే ప్రత్యేక హోదా సంగతేంటే అని ప్రశ్నించారు. హోదా కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
ఇక అంతే కాదు కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ తెలుగు రాష్ట్రాల పైన దృష్టి సారించిందని, రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణాలలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని నారాయణ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మొత్తానికి జగన్ పనితీరును పొగుడుతూనే ప్రత్యేక హోదా గురించి ఏం చేశారంటూ , ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం అంటూ సిపిఐ నారాయణ చాలా చక్కగా చురకలంటించారు.