గాంధీ జయంతి: ఏం మారింది మహాత్మా!
గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం అని గొప్పలు చెప్పుకునే మనం నేడు గాంధీ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్నాం. కానీ గాంధీ చూపిన మార్గంలో నడవడం మాత్రం మనతో సాధ్యం కాని పని. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏమీ మారలేదు. అప్పటికి ఇప్పటికి శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించినా అంటరానిత నం ఇంకా కొనసాగుతూనే ఉంది. కుల వివక్ష ఇంకా బ్రతికే ఉంది.
మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోడీ
గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యం సిద్ధించలేదు
ఆడవాళ్లు అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా నడిరోడ్డు మీద తిరిగే స్వేఛ్చ లేదు. ఎప్పుడు ఏ అఘాయిత్యం జరుగుతుందో తెలియని గందరగోళ స్థితి దాపురించింది. గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు నడిచినప్పుడే, గ్రామ స్వరాజ్యం సిద్ధించినపుడే దేశానికి స్వాతంత్రం సిద్ధించినట్టు .. కానీ ఇప్పటికి మౌలిక వసతులు కూడా లేక పల్లెలు విలవిలలాడుతున్నాయి.పట్టించుకునే నాధుడు లేక పల్లెలు కన్నీరు పెడుతున్నాయి .అంటరానితనం , అస్పృశ్యత ఇంకా చాలా చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. సమానత్వం, సౌభ్రాతృత్వం మచ్చుకు కూడా కనిపించని వ్యవస్థలో ఏం మారింది మహాత్మా అని అంతర్మధనానికి గురవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
వేళ్ళూనుకున్న కుల వ్యవస్థ .. అత్యాచార భారతం
ప్రతి నిత్యం జరుగుతున్న దారుణాలు చూస్తే మనుషుల నైతిక విలువలు పతనం అవుతున్న తీరు చూస్తే సమాజం ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. తొమ్మిది నెలల పసికందు మీద అత్యాచారం చేస్తున్న మృగాళ్లు ఉన్న నేటి రోజుల్లో, ఆడపిల్ల పుట్టిందని వడ్ల గింజ వేసో, నీటి తొట్లో నుంచో కన్నవారే కడతేరుస్తున్న నేటి సమాజంలో ఏం మారింది మహాత్మ.. వావివరుసలు మరచి, విచక్షణ రహితంగా పసిపిల్లల మీద గ్యాంగ్ రేప్ లు చేస్తున్న విషం నిండిన సమాజంలో ఏమీ మారలేదు. రోజు రోజుకి మనుషుల్లో క్రూరత్వం, పైశాచికత్వం, రాక్షసత్వం పెట్రేగిపోతున్నాయి. కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకు పరువు కోసం అల్లుడిని హత్య చేయించిన మారుతీరావు వంటి తండ్రులున్న మన సమాజంలో అమృత ప్రణయ్ ల విషాద గాధలాంటి కథలెన్నో . ఇలాంటి ఘటనలు వేళ్ళూనుకున్న కులవ్యవస్థను చెప్పకనే చెబుతున్నాయి.
అహింస అనే పదానికి అర్ధం మరచిన సమాజం
అహింస పరమధర్మమని తెలిసినా అడుగడుగున హింసాత్మక ఘటనలు, రక్తపు మరకలు అహింస అనే పదానికి అర్ధం మరిచిపోయేలా చేశాయి. ఎక్కడ చూసినా హత్యలు ,ఆత్మహత్యలు, మానభంగాలు, అవినీతి ,అక్రమాలు, ద్రోహాలు, దోపిడీలు పెరిగిపోయిన నేటి రోజుల్లో ఏం మారింది మహాత్మ అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం తప్ప మార్పు కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సమాజం ఉంది. కులాలు, మతాల పేరుతో కొట్టుకు చావడం, రాజకీయ చదరంగంలో పావులు కావడం సామాన్య ప్రజలకు అలవాటైపోయింది.
పెట్రేగిపోతున్న రాజకీయ నాయకుల దోపిడీ
దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన నాయకులు స్వప్రయోజనాల కోసం దేశాన్ని దోచుకు తింటున్నా ఇదేంటి అని ప్రశ్నించ లేక, చేతకాక, చేవ చచ్చి చూస్తున్న జనం ఇది ఇంతే అనే నిర్లిప్త వైఖరికి ఎప్పుడో వచ్చేశారు. నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. అంతగా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. తనకే కాదు తన తరువాత పది పదిహేను తరాల కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి వెనకెయాలన్న ఉద్దేశంతో రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అయినా ప్రశ్నించే వారు లేరు. గాంధీ ఆశయాలను, ఆయన చూపిన మార్గాన్ని, ఆయన ఆచరణలను అనుసరించిన వారు లేరు.
నాగరికత ముసుగులో అనాగరికత
గాంధీ జయంతి నాడు బాపూజీని గుర్తు చేసుకుని ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవడానికే పరిమితం అవుతున్న నాయకులు ఉన్న నేటి రోజుల్లో ఏం మారలేదు మహాత్మా అని చెప్పాల్సి వస్తుంది. గాంధీ పుట్టిన దేశంలో, బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో నేటి నాగరికత ముసుగులోనూ పెరిగిపోతున్న అనాగరికతకు అసహాయలుగా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఏం మారింది మహాత్మ అని ఆవేదన చెందడం, సిగ్గు తో తల దించుకోవటం మినహాయించి ఇంకేం చేయగలం.