కవిత భవిత ఏంటి..! రాజకీయంగా వెంటాడుతున్న పలు సవాళ్లు..!!
హైదరాబాద్ : స్వయం కృతాపరాధం.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును వెంటాడుతున్నాయి. బలమైన నేతగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిన పాపం భవిష్యత్ లోనూ చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని వెంటాడుతుంది. నిజామాబాద్లో కవిత ఓడిపోయింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ కవిత ఓటమి మాత్రం అలా కాదు. నాలుగు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో భారీమెజార్టీ సాధించిన గులాబీ పార్టీకి ఇది ఊహించని పరాభవమే. పథకాలు గట్టెక్కిస్తాయని.. పాలకులు చేసే తప్పులను మాఫీ చేస్తాయని భావించే పార్టీలకు ఇదో గుణపాఠం.
అతి ఆత్మ విశ్వాసం..! ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకే ప్రాధాన్యతనిచ్చిన కవిత..!!
నిజామాబాద్లో కవిత ప్రజాసంక్షేమం కంటే కూడా రాజకీయ ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ప్రాధాన్యతనిచ్చారు. పార్లమెంట్లో అమోఘంగా మాట్లాడగలదనే పేరున్న ఆమె పసుపుబోర్డు ఏర్పాటులో ఎంతవరకూ ప్రయత్నం చేశారనేది కేవలం పసుపు పండించే రైతులకు మాత్రమే తెలిసిన అంశం. తనకు ప్రతిగా ఎదిగే నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగటం కూడా కవితను ఈ దఫా ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యేలా చేసింది.
ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసిన కవిత..! దెబ్బ కొట్టిన పసుపు రైతులు..!!
కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన డి.శ్రీనివాస్ వంటి సీనియర్ నేతనూ పరాభవించటాన్ని అక్కడి మున్నూరు కాపులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే రైతుల నుంచి వ్యతిరేకత ఉన్న చంద్రశేఖర్ రావు కూతురుకు స్వయంగా పసుపు రైతులు 100 మంది వరకూ నామినేషన్లు వేయటంతోనే ఓటమికి పునాది పడింది. రైతులు సాధించిన 90 వేల ఓట్లు చంద్రశేఖర్ రావు సర్కారుపై వ్యతిరేకతకు నిదర్శనమనే చెప్పాలి. అదే సమయంలో జాతీయస్థాయిలో బీజేపీ ప్రతిష్ఠ.. ఎంపీగా కమలం నుంచి బరిలోకి దిగిన అర్వింద్పై అపారమైన నమ్మకం ఓటర్లను అటువైపు మళ్లించాయి.
నిజామాబాద్ ప్రజల పల్స్ పటకటుకోలేక పోయి కవిత..! అనూహ్య ఓటమి..!!
దీంతో ఊహించని ఫలితం చంద్రశేఖర్ రావు కు ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, రైతు ప్రయోజనాలు పట్టించుకోవట్లదనే అంశాలు చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. 16 చోట్ల గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న చంద్రుడి ఆశలూ గల్లంతయ్యాయి. వీటన్నింటి మధ్య కవిత రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చింది. కానీ మరో ఛాన్స్ హుజూర్నగర్ ఉప ఎన్నిక రూపంలో ఊరిస్తుంది. ఇటీవల ఉత్తమ్కుమార్రెడ్డి ఎంపీగా నెగ్గటంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక తప్పనిసరిగా మారింది. అయితే గతంలో పోటీచేసి ఓడిన సైదిరెడ్డి కూడా మరోసారి బరిలో దిగాలని ఆశపడుతున్నాడు.
హుజూర్నగర్ ఉప ఎన్నిక లో కవిత..! ఓడిపోతే తలవంపులే అంటున్న పార్టీ శ్రేణులు..!!
ఉత్తమ్ మాత్రం తన భార్య పద్మావతిని అక్కడ పోటీ చేయించాలనుకుంటున్నాడు. అయితే అక్కడ కాంగ్రెస్కు ఉన్న బలం, ప్రజా వ్యతిరేకత కారణంగా కవితను రంగంలోకి దింపి పరువు పోగొట్టుకోవటం కంటే పాతనేతలకే ప్రాధాన్యతనివ్వాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ బాధ్యతలు కవితకు అప్పగించి కొద్దికాలం వేచి చూద్దామనే ధోరణిలో గులాబీబాస్ ఉన్నట్టు సమాచారం. అయితే కవిత మాత్రం హుజూర్నగర్ నుంచి పోటీచేసి గెలిచాక మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇంతటి సంకట స్థితి నుంచి చంద్రశేఖర్ రావు ఎలా బయటపడతారు.. ఉప ఎన్నికను ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కవిత రాజకీయ భవితను మళ్లీ పట్టాలెక్కించి పరుగులుపెట్టించేందుకు అనేక సవాళ్లను అదిగమించాల్సొస్తుందనే చర్చ చంద్రశేఖర్ రావు కోటరీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.