శిఖా చౌదరీ, పోలీసు అధికారుల పాత్రపై ఆరా .. నేడు మరోసారి జయరాం హత్యకేసు విచారణ
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ .. పూటకో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసు తీగలాగితే .. మూలాలు ఎక్కడినుంచో కదులుతున్నాయి. కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. వారిని విచారించే కొద్దీ సంచలన విషయాలు బహిర్గతమవుతున్నాయి.
నేడు మళ్లీ విచారణ
బుధవారం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సినీనటుడు సూర్య, ఇబ్రహీంపట్న ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్ సహా మిగతా ముగ్గురు పోలీసులు ప్రశ్నించారు. జయరాం హత్య .. దారితీసిన అంశాలపై సుదీర్ఘంగా విచారించారు. విచారణలో రాబట్టిన అంశాలతో నేడు మరోసారి విచారణకు రావాలని స్పష్టంచేశారు. ఐదుగురు పోలీసులు, సూర్యను మళ్లీ ఎంక్వైరీ చేస్తారు. ప్రధానంగా హత్యలో శిఖాచౌదరీ పాత్రపై ఆరాతీసే అవకాశం ఉంది.
నగేశ్, విశాల్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ?
జయరాం హత్యలో రాకేశ్ కు సహకరించిన నగేశ్, అతని మేనల్లుడు విశాల్ గురువారం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వీరిని అదుపులోకి తీసుకోవడంతో రాకేశ్ రెడ్డి వ్యుహరచన మొత్తం బయటకొస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ కేసులో శిఖా చౌదరీ ఇన్వాల్ మెంట్ .. హత్య జరిగిన సమయంలో రాకేశ్ తో టచ్ లో ఉందా అనే ప్రశ్నలకు వీరి నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ఆధారంగా రూ. 4.5 కోట్ల కోసమే రాకేశ్ జయరాంను హత్య చేశారా ? లేదంటే జయరాం ఆస్తులపై కన్నేశారా ... అవీ కాదంటే శిఖా చౌదరీ కోసమా అనే అంశాలపై క్లారిటీ వస్తోంది.
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
జయరాం హత్య కేసులో ఇప్పటికే పోలీసులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా రాకేశ్ తో టచ్ లో ఉన్న వారి విచారణ కొనసాగుతోంది. విచారణలో వారు చెప్పే అంశాల ఆధారంగా చార్జీషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.