పొన్నాల,శశిధర్ రెడ్డి భవితవ్యం ఏంటి..? కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినట్టేనా..?
హైదరాబాద్ : కాంగ్రెస్ తరపున తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల రెండో జాబితాను బుదవారం ఉదయమే విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. దీంతో ఆయన శిబిరంలో ఆందోళన ప్రారంభమయ్యింది. సాధారణంగా తన పేరు మొదటి జాబితాలోనే ఉంటుందన్న ధీమాలో ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అధిష్టానం పెద్ద షాకే ఇచ్చింది. ముప్పై ఐదేళ్ల ప్రజా జీవితం కలిగిన అందునా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా చేసిన వ్యక్తి పేరును పక్కన పెట్టడం అది కాంగ్రెస్ లోనే సాధ్యమనే చర్చ జరుగుతోంది.
పొన్నాలకు షాకిచ్చిన అదిష్టనం..! సుధీర్ఘ రాజకీయ జీవితం పై నీలినీడలు..!!
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటిస్తే అందులో మొదటి పేరు తనదే ఉంటుందన్న విశ్వాసంతో ఉండేవారు పొన్నాల. కానీ మొన్న సోమవారం అర్ధరాత్రి విడుదల చేసిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖంగుతిన్న పొన్నాల మర్నాడు ఉదయమే ఢిల్లీ వెళ్లి కేంద్ర పార్టీ పెద్దలను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఏఐసీసీ ప్రతినిధులను కలసిన తరవాత బయటకి వచ్చి కూడా తన పేరు రెండో జాబితాలో ఉంటదని ధీమా వ్యక్తం చేశారు. ఒక బీసీకి అన్యాయం చేసిందని ప్రత్యేర్ధులు ప్రచారం చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదనే నమ్మకం నాకుందని చెపప్పుకొచ్చారు.
ఎక్కడ తేడా వచ్చింది..? ఎందుకు సీటు ఇవ్వలేదు..? మదనపడుతున్న పొన్నాల..!!
బుధవారం ఉదయం విడుదల చేసిన రెండో జాబితాలో కూడా పొన్నాల లక్ష్యయ్య పేరు లేదు. దీంతో ఇప్పుడు పొన్నాల శిబిరంలో ఆందోళన ప్రారంభమయ్యింది. ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా జరుగుతన్న వ్యవహారమే అనే అనుమానాలు పొన్నాల వర్గీయుల్లో బలపడుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ టిక్కెట్ ఎటూ పోదని ధీమాగా ఉన్న పొన్నాల సైతం ఇప్పుడు ‘దాల్ మే కుచ్ కాలా హై' అంటూ తలపట్టుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఆజాత శత్రువు. అందరిలో కలసిపోయి పనిచేసే నాయకుడు. అయితే ఈ సారి తెలంగాణలో ఒక బలమైన వాదన తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కానీ లేకపోతే దళితుడిని కానీ ముఖ్యమంత్రిని చేయాలన్నదే ఆ వాదన. ఇప్పుడు ఈ వాదనే పొన్నాల కొంప ముంచింది.
మర్రి శశిధర్ రెడ్డి కి కూడా చెయ్యిచ్చిన కాంగ్రెస్..! సనత్ నగర్ టీడిపి కే..!!
మాజీ ముఖ్యమంత్రి కుమారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత... అధిష్టానం వద్ద బాగా పలుకుబడి ఉందనే పేరున్న మర్రి శశిధర్ రెడి సైతం టిక్కెట్ సాధించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆయన పరు కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకూ విడుదల చేసిన రెండు జాబితాలలో లేకపోవడం విశేషం. ఆయన పోటీ చేయాలని భావిస్తున్న సనత్ సనగర్ అసెంబ్లీ స్ధానం టీడీపీకి కేటాయించేలా కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు చక్రం తిప్పారని సమాచారం. శిధర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అన్ని అర్హతలు ఉన్న నాయకుడు, పై పెచ్చు అధిష్టానానికి బాగా పరిచయం ఉన్న నేత. ఈ నేపథ్యంలో ఆయనకు సనత్ నగర్ టిక్కెట్ రాకుండా వ్యూహాత్మకంగా టీడీపీకి ఆ సీటు దక్కేలా చేసారని ప్రచారం జరగుతోంది.
భట్టి కి అండగా కొప్పుల రాజు..! చక్రం తిప్పనున్న విక్రముడు..!!
ఇక దళిత సామాజికవర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేయాల్సి వస్తే ఆ అవకాశం మల్లు భట్టి విక్రమార్కను వరించే అవకాశం ఉంది. దీంతో ఆయన్ను కూడా ఇబ్బందుల పాలు చేద్దామని ప్రయత్నించినా, రాహుల్ గాందీ రాజకీయ సలహాదారు అయిన మాజీ ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు అండదండలు పుష్కలంగా ఉండటంతో భట్టిని ఏం చేయలేకపోయారు. దీనికి తోడు భట్టి వయసు కూడా ఆయనకు సహకరించింది. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డిల్లా అరవై, డబ్భై దశకాలు దాటిన నాయకుడు కాకపోవడం భట్టికి కలసి వచ్చింది.