కొత్తవి నిర్మించాల్సిన ఆవశ్యత ఏంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!
హైదరాబాద్: ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషనర్ హెరిటేజ్ కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ఎర్రమంజిల్ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది.
Recommended Video
తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై హైకోర్టులో సీరియస్ వాదనలు నడిచినట్టు తెలుస్తోంది. ఉన్న నిర్మాణాలను వదిలేసి కొత్తవి కట్టాల్సిన అవసరం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇరుంమంజిల్ భవనం, హెరిటేజ్ భవనం, చారిత్రాత్మక భవనాన్ని కూల్చడానికి కారణాలేంటని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్స్... నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలని కోర్టు ఆదేశించింది.సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆ భవనాలు మరో 50-70 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉంటాయని, వాటిని కూల్చి.. నూతన భవనాలు నిర్మించాలని తలపెట్టడం భారీగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. భవనాలను కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్ శుక్రవారం విచారణకు వస్తున్నందున.. ఈ వ్యాజ్యాన్ని దాంతోపాటే విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈమేరకు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయంపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, తదితరులు 2016లో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే.