10 నెలల్లో ఇద్దరు ఎస్ఐల ఆత్మహత్య: కుకునూర్పల్లిలో ఏం జరుగుతోంది?
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో పది నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ ఐ లు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో పది నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ ఐ లు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది.పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ ఐ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిజిపి పోలీసులను ఆదేశించారు.
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో గత ఏడాది ఆగష్టుమాసంలో రామకృష్ణారెడ్డి అనే ఎస్ ఐ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని పోలీస్ స్టేషన్ క్వార్టర్ లోనే ఆత్మహత్య చేసుకొన్నాడు.
రామకృష్ణారెడ్డి స్థానంలో ఎస్ ఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి కూడ అదే స్థలంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. పదిమాసాల వ్యవధిలోనే ఒకే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఎస్ ఐ లు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహవేశాలను వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలను ఆయన కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు కూడ పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఉన్నతస్థాయి దర్యాప్తుకు పోలీసుల ఆదేశం
కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తుకు డిజిపి అనురాగ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయమై అడిషనల్ డిజి గోపాలకృష్ణను విచారణ అదికారిగా నియమించారు. సంఘటనస్థలానికి అడిషనల్ డిజి గోపాలకృష్ణ చేరుకొన్నారు. వాస్తవాలను విచారిస్తున్నారు. పది మాసాల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ ఐ లు ఒకే పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది.ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యులు , గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో బుదవారం సాయంత్ర కుకునూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కానిస్టేబుల్ గా పనిచేసి ఎస్ ఐ గా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి తొలుత కానిస్టేబుల్ గా పనిచేశాడు. పోలీస్ శాఖలోకి కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు. కొంతకాలం పాటు హైద్రాబాద్ లో విధుల్లో నిర్వహించారు. అనంతరం 2012 లో ఆయన ఎస్ ఐ గా ఎంపికయ్యారు.మల్కాజిగిరి, శామీర్ పేట, కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లలో ఆయన ఎస్ ఐ గా పనిచేశారు. 2016 ఆగష్టులో రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత అదే పోలీస్ స్టేషన్ కు ఎస్ ఐ గా విధుల్లో చేరారు. ఏడాదిన్నర క్రితం రామకృష్ణారెడ్డికి వివాహమైంది. ఆయనకు భార్య రచన, ఐదు నెలల బాబు ఉన్నాడు. ప్రభాకర్ రెడ్డికి ఇద్దరు సోదరులు. సంజీవరెడ్డి అనే సోదరుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. భాస్కర్ రెడ్డి అనే సోదరుడు టంగుటూరులో పాల కేంద్రాన్ని నడుపుతున్నారు.
ఉన్నతాధికారుల వేధింపులేనా?
ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రభాకర్ రెడ్డి భార్య రచన మీడియాకు చెప్పారు. ఈ వేధింపులు భరించలేక బదిలీ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆమె చెప్పారు. ములుగుకు బదిలీపై వెళ్లే అవకాశం ఉందని , అప్పటివరకు ఇక్కడే ఓపికతో పనిచేస్తున్నాడని ఆమె మీడియాకు వివరించారు. ఈ లోపుగానే ఈ ఘోరం జరిగిపోయిందని ఆమె కన్నీరు పెట్టుకొన్నారు.
గజ్వేల్ ఎసీపీపై వేటు?
ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటనకు సంబంధించి గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై వేటు పడింది. ఆయనను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటనతో పాటు, ఉన్నతాధికారుల వేధింపులు, శిరీష వ్యవహరంపై ఆయన విచారణ జరపనున్నారు. గజ్వేల్ ఏసీపీపై చర్య తీసుకోవడంతో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులు కారణముందనే అంశాన్ని ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు ప్రస్తావిస్తున్నారు. గతంలో రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో అప్పటి సిద్దిపేట డిఎస్పీ శ్రీధర్ పై బదిలీ వేటేశారు. రామకృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్ లో డీఎస్పీ వేధింపులు కారణమని రాశాడు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత రెండుగంటలవరకు కూడ ఆయన ఘటన స్థలానికి వెళ్లకపోవడం వల్లే వేటేసినట్టు కొందరు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆత్మహత్య ఇలా వెలుగులోకి
నాలుగురోజుల క్రితం భార్య రచన పుట్టింటికి వెళ్ళింది. దీంతో ప్రభాకర్ రెడ్డి ఒంటరిగా ఉంటున్నాడు. బుదవారం ఉదయం 9 గంటలకు రూల్ కాల్ నిర్వహించి తిరిగి క్వార్టర్ కు వచ్చాడు. కొంతసేపటికి గజ్వేల్ లో ఉన్న కానిస్టేబుల్ మురళికి ఫోన్ చేసి కొబ్బరినీళ్ళు తెమ్మని చెప్పారు. మురళి కొబ్బరినీళ్లు తెచ్చేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. ఎంతకీ తలుపుతీయకపోవడంతో కిటీకీలో నుండి చూస్తే ప్రభాకర్ రెడ్డి చనిపోయి ఉన్న విషయాన్ని గుర్తించాడు. విషయం తెలుసుకొన్న కమిషనర్ ఘటన వివరాలను సేకరించారు.