చంద్రబాబూ ఏందిది..! ఏపిలో ఓ నీతి..! తెలంగాణలో మరో నీతా..?
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపి ముఖ్యమంత్రి, టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు చురుగ్గా పాల్గొంటున్నారు. తెలంగాణలో పోటీ చేస్తున్న మహాకూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణలో తాను చేసిన అభివ్రుద్ది, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల గురించి తన ప్రసంగాల్లో ప్రతిబింబించేట్టుగా బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతవరకూ తెలంగాణ లో బాబు పర్యటనకు ఢోకా లేదు గాని ఆ ఎమ్మెల్యేల గురించి ప్రస్థావించి సరిదిద్దుకోలేని పొరపాటు చేసినట్టు చర్చ జరుగుతోంది. అంతే కాకుండా సీయం స్థాయిలో చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
వివాదాస్పదం అవుతున్న బాబు వ్యాఖ్యలు..! టీ ప్రచారంలో ఎమ్మెల్యేల అంశం ప్రస్తావించిన బాబు..!!
చంద్రబాబు అంటే ఓ అపరమేధావి. ఆయన వేసే ఎత్తుగడలు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఎలాంటి తరుణంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా బాబు వేసే రాజకీయ ప్రణాళికకు తిరుగుండదు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇదే రీతిలో తాజాగా ఆయన చెప్పిన మాటలు, టీడీపీ వీడి వేరే పార్టీ లోకి మారిన నేతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రచారంలో భాగంగా ఆయన వేస్తున్న ఎత్తుగడలకు ఏపి టీడిపి కి ప్రమాదం తెచ్చే విధంగా పరిణమించిందనే చర్చ జరుగుతోంది.
ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయింపుల ప్రస్థావన..! ఏపిలో కూడా ఇలాగే స్పందిస్తారా..!
చంద్రబాబుది తెలంగాణకు ఒక నీతి - ఆంధ్రాకు ఒక నీతి అంటూ చెలరేగిపోతున్నారు. బాబు, ఆయన బావమరిది బాలకృష్ణ పార్టీ ఫిరాయింపుల విషయమై తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 23 మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవటమే గాక, వాళ్లంతా కేవలం అభివృద్ధి చూసి వచ్చారని చంద్రబాబు అనటం చూశామని, అదే చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలను చిత్తుగా చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునివ్వడం ఏంటనే చర్చ జరుగుతోంది. రేపు ఏపిలో కూడా బాబు ఇలాగే పిలుపునిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలంటున్న బాబు..! ఏపిలో కూడా పిలుపునిస్తారా అంటున్న ప్రతిపక్షాలు..!
ఏపీలో చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ, ఫిరాయింపుదారులను ప్రోత్సహించారని అంటున్నారు. ఇతర పార్టీ నేతలను రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకునేది పోయి, వేరే పార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనసాగించడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇవ్వటం అప్పుడు రాజ్యంగ విరుద్దంగా కనిపించలేదా అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. చంద్రబాబుకు ఏపిలో తెలంగాణ రెండు రాజ్యాంగాలు ఉన్నాయా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది.
బాబు ఏమరుపాటు..! ఏపి టీడిపి కి ఇబ్బందిగా మారిన పరిణామాలు..!
రాజకీయ నాయకులు ఎత్తుగడలు వేయటం, వాటిని ఆచరణలో పెట్టడం చూస్తుంటాం. అదేరీతిలో వాటిని భిన్న కోణాల్లో విమర్శించేవారూ ఉంటారు. ఎవరికీ తోచిన దారిలో వారు విమర్శలకు తెరలేపుతుంటారు. ఇదంతా మామూలే.! అదే ఇక్కడ జరిగింది. బాబుతో పాటు సినీ నటుడు బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యల వల్ల ఇలా అడ్డంగా విమర్శల పాలవడంతో టీడీపీ శ్రేణులు కాస్త కలత చెందాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉద్రుతంగా పాల్గొంటున్న చంద్రబాబు ఇదే తరహాలో ప్రసంగిస్తే కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెట్టే ప్రమాదం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.