కూర్చొని పరిష్కరించుకుంటారా... కౌన్సిల్ లోనే తేల్చుకుంటారా... అందరి చూపు జగన్,కేసీఆర్ వైపే...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటినుంచి ఒక అవగాహనతో ముందుకు సాగుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఒకానొక దశలో ఇద్దరి మధ్యా చిచ్చు రేగుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ జరగకపోయినప్పటికీ కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతూనే ఉంది.
పరస్పర ఫిర్యాదులు... జటిలమైన సమస్యలు...
రాయలసీమకు నీళ్లందించే పోతిరెడ్డిపాడు జల సామర్థ్యాన్ని పెంచుతూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం,దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకపోవడంతో... ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మళ్లీ హీటెక్కాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. మరోవైపు గోదావరిపై తెలంగాణ సర్కార్ కాళేశ్వరానికి అనుబంధంగా చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల జల వివాదాలు మరింత జటిలమయ్యాయి.
ఎవరూ తగ్గట్లేదు...
పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఏపీ సర్కార్ కౌంటర్ వ్యూహాన్ని సిద్దం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను ఎగువన ఉన్న తెలంగాణ అదనంగా వాడుకుంటోందని ఏపీ వాదిస్తోంది. పాలమూరు-రంగారెడ్డిని ప్రాజెక్టును నిలిపివేస్తే పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్లమన్న వాదన తీసుకొచ్చింది. అయితే తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. దీనిపై రాజీ లేని వైఖరిని అనుసరిస్తామన్నారు.
కేంద్రం జోక్యం...
ఇలా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఎక్కడివక్కడే ఉన్న తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుంది. అగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని,ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాలని ఆహ్వానం పంపించింది. అయితే తమను సంప్రదించకుండానే సమావేశ తేదీని,ఎజెండాను ఖరారు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వల్ల ఆరోజు భేటీకి హాజరవడం వీలు కాదని చెప్పారు. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసింది.
Recommended Video
ముఖ్యమంత్రులు ఏం చేస్తారో...
అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందనిదే కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖలో స్పష్టం చేశారు. జల వివాదాల పరిష్కారం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందన్నారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీ త్వరలో జరగాలని చెప్పారు. అయితే కేంద్రం తీరు హాస్యాస్పదంగా ఉందంటూ తెలంగాణ సర్కార్ ఇదివరకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పునర్విభజన చట్టం ప్రకారం జల వివాదాల పరిష్కారం ట్రిబ్యునల్స్కు అప్పగించాలని... వివాదాలు లేనప్పుడు మాత్రమే కేంద్ర ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ జరగాల్సి ఉంటుందని కేసీఆర్ సర్కార్ వాదిస్తోంది. ఈ వైఖరిని మార్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి లేఖలు రాయడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జల వివాదాలను కౌన్సిల్లోనే తేల్చుకుంటారా... లేక మునుపటి అవగాహన ప్రకారం సామరస్యంగా కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తారా అన్నది వేచి చూడాలి.