నేను ముఖ్యమంత్రి అవుతాననే వార్తల్లో నిజం లేదు, నా పని తీరువల్లే వర్కింగ్ ప్రెసిడెంట్: కేటీఆర్
హైదరాబాద్: మరో పదిహేనేళ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తేల్చి చెప్పారు. పార్టీలో అందరి కోరిక కూడా ఆయ సీఎంగా ఉండాలని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. ఏపీలోను తెరాస పాత్ర ఉంటుందని చెప్పారు.
2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ఓ వైపు, మిగిలిన పార్టీలన్నీ మరోవైపు నిలబడితే 98 లక్షల మంది తమకు ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు కాంగ్రెస్కు టీఆర్ఎస్ పార్టీకి మధ్య 42 లక్షల ఓట్ల అంతరం ఉందని, 47 శాతం ఓట్లతో 75 శాతం సీట్లు వచ్చాయని, అంటే 88 సీట్లు వచ్చాయని చెప్పారు.
నేను ముఖ్యమంత్రి అవుతాననే వార్తల్లో నిజం లేదు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుపై వ్యతిరేకతతో పడిన ఓట్లు కావని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాటు చేసిన పనుల కారణంగా పడిన సానుభూతి ఓటు అని చెప్పారు. టీఆర్ఎస్ గొప్ప రాజకీయశక్తిగా ఎదిగి, ఢిల్లీ రాజకీయాలను శాసిస్తుందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో 16 లోకసభ సీట్లు ఢిల్లీ పీఠాన్ని శాసిస్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అవుతానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, రాష్ట్రానికి మరో పది పదిహేనేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారని చెప్పారని, జాతీయ రాజకీయాలను హైదరాబాద్లో ఉండి శాసించవద్దని ఎక్కడా లేదని చెప్పారు.
ఎన్టీఆర్ హయాంలో ఇలాగే జరిగింది
గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హయాంలో లోకసభలో కూడా టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిందని, అప్పుడు ఎన్టీఆర్ సీఎంగా ఉంటూనే దేశ రాజకీయాలను శాసించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే చేస్తారని అభిప్రాయపడ్డారు. తాము కూడా జాతీయ రాజకీయాల్లో ఇక కీలకపాత్ర పోషిస్తామని, అందులో భాగంగా ఏపీ రాజకీయాల్లోనూ పాత్ర తీసుకుంటామని చెప్పారు. తన జీవితంలో ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు ఇది అన్నారు. కేసీఆర్కు ప్రజల్లో ఉన్న విశ్వాసం, ఆయనతో పేదలకు ఉన్న పేగుబంధానికి నిదర్శనమన్నారు.
అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చా
గ్రామాల నుంచి హైదరాబాద్ వరకు పార్టీని ఆదరించారని కేటీఆర్ చెప్పారు. వారికి తాము శాశ్వతంగా రుణపడి ఉంటామన్నారు. అన్ని పార్టీల వాదనలు విన్న తర్వాతే ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, రక్షణ కవచంలా ఉన్న పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్నారు. పార్టీలో సీనియర్లు ఉన్నా సమర్థతను చూసి తనకు పదవి ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉండగా రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించడం, ఈ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18 సీట్లలో విజయంతో పాటు నా పనితీరును చూసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని చెప్పారు.
ప్రాంతీయ పార్టీలే కీలకం
2019 ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్ల వరకు, కాంగ్రెస్ పార్టీకి 90 సీట్ల వరకు వస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. మిగతా ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. టీఆర్ఎస్, టీడీపీ, అన్నాడీఎంకే, బిజు జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రాంతీయ పార్టీలే ఉన్నాయని, ఈ విశ్లేషణలను పరిశీలిస్తే 2019లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యమని చెప్పారు. అందుకే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా మారుతుందని చెప్పారు. ఇది పార్టీలను కలిపి ఏర్పాటు చేసే ఫ్రంట్ కాదని, దేశాన్ని ఒక్కటి చేసే ఫ్రంట్ అని చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సీరియస్గా దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
మీడియా దుర్భాషాలాడినా
తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పత్రికల్లో రాశారని, వ్యతిరేకత ఉంటే గెలవరు కదా, మరి ఎందుకు గెలిచారని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై కూడా నెగిటివ్ వార్తలు వచ్చాయని, ఫాంహౌజ్లో ఉంటారని, సచివాలయంకు రారు అని రాశారని, అయినా ఏమయింని, ప్రజలు గెలిపించారని చెప్పారు. కేసీఆర్ను దుర్భాషలాడినా యథాతథంగా ప్రచురిస్తాం అంటే తప్పు అని, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అని, ఓ పార్టీ అధ్యక్షుడు అని, ఆయనను నోటికి వచ్చినట్లు తిడితే ఆ మాటలను యథాతథంగా ప్రచురించి పైశాచికంగా ఆనందం పొందడం ఏమిటని నిలదీశారు. కొంత సంయమనం రెండు వైపులా ఉండాలన్నారు. పొరపాటున మేమెప్పుడన్నా మాట తూలితే ప్రచురించాలా వద్దా అనే ఇంగితం కూడా ఉండాలి కదా అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ఆ పాత్ర మీడియా పోషించాలన్నారు. ఇప్పుడు లైవ్ టీవీలు వచ్చాయని, అసెంబ్లీలో మేం కూడా పది సెకన్లు ఆపి ఇస్తున్నామని, ఇప్పుడు పిల్లలు కూడా టీవీలు చూస్తున్నారని, ముందే రాజకీయ నాయకులపై పలుచన భావం ఉందని చెప్పారు. అవేం బూతులు, మాటలని, మేమూ సంయమనంతో వ్యవహరించాలన్నారు.