ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు... శ్రీశైలం పవర్ ప్లాంట్లో రాత్రి అసలేం జరిగింది...
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ప్రమాద సమయంలో విధుల్లో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా... 8 మంది సొరంగ మార్గం నుంచి బయటపడ్డారు. వీరిలో ఆరుగురికి గాయాలయ్యాయి. మిగిలిన 9 మంది మాత్రం సొరంగంలోనే చిక్కుకుపోయి... దట్టమైన పొగ కారణంగా అందులోనే ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో గాయాలపాలైన ఆరుగురు ఉద్యోగులు ప్రస్తుతం జెన్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన మెయింటెనెన్స్ డీఈ ఘటన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
20ని. పాటు ప్రయత్నించినా...
జెన్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెయింటెన్స్ డీఈ మాట్లాడుతూ.. ప్రతీరోజూ తమకు ఓవర్ టైమ్ డ్యూటీ కామన్ అన్నారు. అలాగే గురువారం రాత్రి 10గం. తర్వాత కూడా ఇంకా విధుల్లోనే ఉన్నట్లు చెప్పారు. రాత్రి 11గం. సమయంలో 4,5,6వ యూనిట్ వద్ద ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు చెప్పారు. సిబ్బంది తమకు విషయం చెప్పగానే పరిగెత్తుకెళ్లామన్నారు. నాలుగైదు కార్బన్ డై యాక్సైడ్ సిలిండర్స్తో దాదాపు 20 నిమిషాల పాటు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించామన్నారు. కానీ అప్పటికే దట్టమైన పొగ కమ్ముకుపోయిందని... ఎదురుగా ఎవరున్నారో కూడా కనిపించని పరిస్థితి నెలకొందని అన్నారు.
పునర్జన్మే అంటున్న మెయింటెనెన్స్ డీఈ..
ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏదో మార్గం ద్వారా తాను బయటపడ్డానని... ఎలా బయటపడ్డానో తనకే తెలియదని చెప్పారు. ప్లాంట్లో మూడు ఎస్కేప్ టన్నెల్స్ ఉన్నాయని... ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ లైటింగ్ కూడా పనిచేసిందని... అయినప్పటికీ పొగ కారణంగా ఏమీ కనిపించకుండా పోయిందని చెప్పుకొచ్చారు. భగవంతుడి దయ వల్లే తాము బయటపడ్డామని.. ఇది పునర్జన్మ లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో తన ముఖానికి,శరీరానికి కాలిన గాయాలైనట్లు తెలిపారు. విపరీతమైన బ్లాస్టింగ్ వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. రాత్రి 11.30 గం. సమయంలో తమను ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. జెన్కో ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. తమ శాయశక్తులా ప్రయత్నించి ఆరుగురు ఉద్యోగులను ప్రాణాపాయం నుంచి తప్పించామన్నారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
ప్రమాదంలో మరణించిన డీఈ కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్గ్రేషియాను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. మిగతా మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రతీ కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామన్నారు. వృత్తి ధర్మాన్ని నిబద్దతతో నెరవేర్చి విధుల్లోనే మృతి చెందిన కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పారు. వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆదుకుంటామన్నారు.
Recommended Video
కారణాలు ఇప్పుడే చెప్పలేమన్న మంత్రి...
ప్రమాద కారణాలపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రమాద అంశాలను నిపుణులు మాత్రమే అంచనా వేయగలరని చెప్పారు. సీఐడీ విచారణలో అసలు విషయాలు బయటపడుతాయన్నారు. కాగా,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.