సర్వేలతో తెలుగు ప్రభుత్వాలకు ఒరిగేదేమిటి..! ఆత్మ సంత్రుప్తా..? ఆత్మ వంచనా..?
హైదరాబాద్: మంచి పనులు చేస్తే ప్రజలే మళ్లీ పట్టం కడతారని ధీమాగా ఉండే రోజులు రాజకీయాల్లో కనుమరుగయ్యాయని చెప్పొచ్చు. మంచి పనులు చేసినా-చేయకపోయినా, ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లినా-వెళ్లకపోయినా, అదికార పార్టీలకు మాత్రం మళ్లీ అదికారం లోకి రావాలనే కసి, పట్టుదల, ఆకాంక్ష తారా స్థాయిలో ఉంటుంది. ప్రజలతో మమేకమై వారి అభిప్రయాలు తెలుసుకునే బదులు సర్వేల పేరుతో అదికార పార్టీలు సంత్రుప్తి పడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేల ప్రకారం ప్రభుత్వాలు తర్వాత చేయాల్సిన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్తుండడం ఇప్పటి జమానా రాజకీయాల్లో సర్వ సాధారణం అయిపోయింది. ఏపీ తెలంగాణలో ఉన్న అదికార పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం సర్వేలు నిర్వహించుకుని ఆత్మసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకి రెండు తెలుగు ప్రభుత్వాల సర్వే నివేదికల ద్వారా ఏ మేరకు సంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
ఇది సర్వేల సమయం..!నివేదికల ప్రకారమే కార్యాచరణ అంటున్న తెలుగు ప్రభుత్వాలు..!
2019 ఎన్నికలు.. అదీ మే లో అంటే.. దాదాపు 8 నెలల సమయం ఉంది. మరి ఇంత గడువు వున్నాఅదికార పార్టీల్లో ఎందుకీ భయం. పార్టీల్లో ఎందుకీ తప్పటడుగులు. మళ్లీ గెలవాలనే తాపత్రయం, ఉబలాటం ఎందుకు..? ఇవన్నీ సగటు ఓటరు మెదడులో మెదిలే డౌట్లు. ఓటరు నాడి గురించి ఇప్పుడెందుకు అనుకుంటుంటే, పార్టీలు మాత్రం గెలుపు మాట విని పులకించి దాన్ని ఓట్లుగా మలచుకునేందుకు సర్వేలపైనే భారమేశాయి. లక్షలు కుమ్మరించి, వీలైతే కోట్లు ఇచ్చి మరీ సర్వే ఏజెంట్లను రంగంలోకి దింపాయి. మీరే పార్టీకు ఓటేస్తారు. మీదేకులం.. మీరు ఏ నాయకుడు అంటే ఇష్టపడతారు. అనే అంశాల పైన ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.
సర్వేలతో నేతలకు ఎంత ప్రమాదమో..!సర్వేలు నిర్వహిస్తున్న ఏజెంట్లకీ అంతే ప్రమాదం..!!
నిజంగా ఇవన్నీ ఏ టీడీపీయో. వైసీపీయో చేయిస్తుందనే ఒకరికొకరు భావిస్తున్నారు. కృష్ణా, అనంతపురం జిల్లాల్లో సర్వే కోసం వెళ్లిన ఏజెంట్లను నానా హింసలకు గురి చేసారట స్థానికులు. తాము బతుకుదెరువు కోసం బయటి నుంచి ఎవరో చెబితే సర్వేలు చేస్తున్నామంటూ నెత్తీనోరు మొత్తుకున్నా విన్లేదట. అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్ఎస్ ఇరు పార్టీలు సర్వేలు చేయిస్తున్నట్లుగా పలుమార్లు ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒకడుగు ముందుకేసి ప్రజల మూడ్ తోపాటు రాబోవు ఎన్నికల్లో ఎన్ని సీట్లు గులుస్తామో కూడా చెప్పుకొస్తున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లకు గాను 100 సీట్లు గ్యారంటీగా గెలుస్తామని చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా కేసీఆర్ దఫదఫాలుగా చేయించుకున్న సర్వే నివేదికల ఆధారంగా చెప్పినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
సర్వేలను నమ్ముకుని ముందుకెళితే మునక తప్పదు..! ఉత్కంఠగా మారిన తెలుగు రాష్ట్రాల సర్వేలు..!
అయితే ఈ సర్వేల వల్ల తప్పేంటి అంటూ వాదిస్తున్నాయి అదికార పార్టీలు. తమ బలం తెలుసుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేసేందుకు చేస్తే తప్పేమిటంటూ వాదించిన సందర్భాలున్నాయి. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరికీ రెండు రాష్ట్రాల్లో ఎవరు బలంగా ఉన్నారనే విషయాన్ని అంచనా వేయటం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఒకరి గెలుపోటములు, మరొక నేతపై ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు కూడా సర్వేల కోసం చాలామందిని రంగంలోకి దింపాయి. వారిచ్చిన నివేదికల ఆధారంగానే భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి.
సర్వేల మీద ఆశలు..! నీటి మీద రాతలే..!
కానీ.. సర్వేలో మరీ డైరెక్టుగా ప్రశ్నలు అడగటమే అసలుకు మోసం తెస్తోంది. ఏదో విధంగా ఓటరు నాడి తెలుసుకున్నా, ఎన్నికల ముందు రోజు వరకూ ఓటరు మనసు ఒకేలా ఉండాలని లేదు. పోలయ్యే ఓట్లలో కేవలం 20శాతం మాత్రమే ఆయా పార్టీలకు సంబంధించిన అభిమానులవి. మిగిలిన వాటిలో ఎన్నికల ముందు రోజు ఓటరు ఏ నేతకు, ఏ పార్టీకి వేయాలనే ఓట్లు 40శాతం వరకూ ఉంటాయనే వాస్తవం ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇదే నిజమైతే సర్వేల ప్రభావంతో గాని ఇతర ఏ కారణాలతో గాని ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న పార్టీలు బొక్కబోర్లా పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ముందే కూస్తున్న తెలుగు కోయిలల పరిస్థితి ఏంటో కొద్ది రోజుల్లో తేలిపోతుంది.