ప్రభుత్వం వల్లే కార్మికులు చనిపోయారనటానికి ప్రూఫ్ ఏంటి ? బాధ్యత మీదే ? ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్టీసీ కార్మికులు కొందరు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే మరణించారని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో జరిగిన వాదనలు కార్మిక లోకానికి షాక్ ఇచ్చాయి. హైకోర్టు ధర్మాసనం పిటీషనర్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో లేడీ టెక్కీ మృతి: శవంతో సెల్ఫీలు దిగిన యువకుడు, నెటిజన్ల ఫైర్
కార్మికుల మరణాలపై హైకోర్టు విచారణ ... హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చేసుకోవడానికి, గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉండి ఉంటాయని, ప్రభుత్వం వల్ల ఆర్టీసీ కార్మికులు చనిపోయారు అనటానికి ప్రూఫ్ ఏంటి అని పిటిషనర్ ను ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ ఆర్టీసీ కార్మికులు మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లను ధర్మాసనం ముందుంచారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం డిస్మిస్ చెయ్యలేదు అన్న ధర్మాసనం
అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించలేదని వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని తెలిపినా అధికారిక ఉతర్వులు ఏవీ అని ప్రశ్నించింది కోర్టు. అంతేకాదు ఆర్టీసీ కార్మికులు మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం, సమ్మెకు పిలుపునిచ్చింది యూనియన్ నాయకులు, సమ్మె చేసింది ఆర్టీసీ కార్మికులు కాబట్టి ఆర్టీసీ కార్మికుల మరణానికి బాధ్యత యూనియన్ నాయకులు వహించాలని వ్యాఖ్యానించింది.
సమ్మెకు కారణం యూనియన్లు .. బాధ్యత వారిదే అన్న కోర్టు
ఇక కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఆత్మహత్యలను ఆపడం ఎలాగో చెప్పాలని పిటిషనర్ ను అడిగింది న్యాయస్థానం. అలాగే గుండె పోటు రాకుండా నివారించడం ఎలాగ అంటూ ప్రశ్నించడం తో పాటుగా ఆర్టీసీ కార్మికుల మరణాలకు,ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సమ్మెకు కారణమైన యూనియన్లు బాధ్యత వహించాలని పేర్కొంది. హైకోర్టు పిటిషనర్ ను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
కార్మికుల గుండెపోటుకు,ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉండొచ్చు అన్న కోర్టు .. విచారణ 28కి వాయిదా
వారికి గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రయత్నం చేస్తున్నా అరెస్టులు చేస్తున్నారంటూ పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల కార్మికులు చాలామంది మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇక దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇక ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ డిపోల్లోకి అనుమతించకపోవడం పై మరో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించారు. ఇక ఈ కేసు విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.