మోదీ వీడియో కాన్ఫరెన్స్ : ప్రధానితో టీఆర్ఎస్ నేతలు ఏం చెప్పారు..?
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(ఏప్రిల్ 8) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కరోనా నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అలాగే లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వైరస్ నియంత్రణ,సంక్షోభ నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ,హోంశాఖ,గ్రామీణ అభివృద్ది శాఖలు వారికి వివరించినట్టు సమాచారం.
తెలంగాణ నుంచి టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు,లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాలను,ఆలోచనలను వారు మోదీకి వివరించారు. లాక్ డౌన్ కొనసాగింపుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారని చెప్పారు. అలాగే ఎంపీల వేతనాల కోత విషయంలోనూ కేంద్రానికి మద్దతు పలికారు. అవసరమైతే 50శాతం కోత విధించినా ఫర్వాలేదని సీఎం అభిప్రాయంగా తెలిపారు. ఇక ఆహార పదార్థాల సేకరణ,వ్యవసాయ ఉత్పత్తుల మెషినరీ విషయంలో కేంద్ర సాయం కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే గిన్నీ బ్యాగులు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో కావాల్సి ఉందని.. బెంగాల్ నుంచి వాటిని తీసుకురావాల్సి ఉన్నందునా.. అందుకు అనుగుణంగా రవాణా సౌకర్యాలపై చర్చించినట్టు సమాచారం.
రేషన్ పంపిణీలో భాగంగా కేంద్రం ఇస్తానన్న కిలో కందిపప్పు హామీ గురించి కూడా టీఆర్ఎస్ నేతలు మోదీని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రానికి కందిపప్పు నిల్వలు చేరలేదని వారు మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో రైతులు పండించి ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఇందుకోసం రూ.35వేల కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు.ఇక లాక్ డౌన్ విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్,ఎన్సీపీ అధినేత శరద్ పవార్,సమాజ్వాదీ ఫ్లోర్ లీడర్ రాంగోపాల్ యాదవ్,బీఎస్పీ ఫ్లోర్ లీడర్ సతీశ్ మిశ్రా,లోక్ జనశక్తి ఫ్లోర్ లీడర్ చిరాగ్ పాశ్వాన్,డీఎంకె ఫ్లోర్ లీడర్ టీఆర్ బాలు,శిరోమణి అకాలీదళ్ ఫ్లోర్ లీడర్ సుక్బీర్ సింగ్ బాదల్,జేడీయూ ఫ్లోర్ లీడర్ రాజీవ్ రంజన్ సింగ్,బిజూ జనతాదళ్ ఫ్లోర్ లీడర్ పినాకి మిశ్రా,శివసేన ఫ్లోర్ లీడర్ సంజయ్ రౌత్ తదితరులు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్కు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానప్పటికీ.. తాజా కాన్ఫరెన్స్కు మాత్రం టీఎంసీ ఎంపీలు హాజరయ్యారు.