ఢిల్లీ రాజకీయాల్లో కేసీఆర్ అడుగుపెడతారనే భయం బీజేపీకి పట్టుకుంది: కేసీఆర్
మహబూబ్నగర్: మే 23 తర్వాత దేశంలో అధికారం చేపట్టబోతున్నది ప్రాంతీయ పార్టీలే అని జోస్యం చెప్పారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ మహబూబ్నగర్లో ప్రసంగించారు. ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయని ఇక ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో సత్తాచాటుతాయని కేసీఆర్ చెప్పారు. బీజేపీకి అధికారంలోకి వచ్చి ఏమి చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ టీఆర్ఎస్ భరతం పడుతుందని మోడీ చెబుతున్నారని టీఆర్ఎస్ పార్టీనే బీజేపీ భరతం పడుతుందని అన్నారు.
తెలంగాణ సంక్షేమ పథకాలనే కేంద్రం కాపీకొడుతోంది
సాగుకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ రైతులకు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని కేసీఆర్ అన్నారు. హోంగార్డులకు దేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని తమ పథకాన్నే కేంద్రం కాపీ కొట్టిందన్నారు కేసీఆర్. చనిపోయిన రైతులను రైతుబీమా పథకం ద్వారా వారి కుటుంబాలను ఆదుకుంటున్నట్లు వివరించిన సీఎం కేసీఆర్... గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు ఇస్తుంటే మహారాష్ట్రలో అక్కడి వారు గొడవకు దిగుతున్నారని వెల్లడించారు.
కేంద్రం కేవలం రూ.200 ముష్టి వేస్తోంది
ఇక కేంద్రం చెబుతున్నవి అన్నీ అబద్దాలే అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వెయ్యిరూపాయల పెన్షన్లో కేంద్రం రూ.800 ఇస్తోందని మోడీ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. 48 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంటే కేంద్రం 6 లక్షల 65వేల మందికి రూ.200 ముష్టి వేసినట్లు వేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వంలో తాను కేంద్రమంత్రిగా పనిచేసినట్లు గుర్తు చేసిన కేసీఆర్... ఆ సమయంలో 11 సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పారు. ఇప్పుడు మోడీ అదేదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాగైతే బుద్ధి చెప్పారో అలానే లోక్సభ ఎన్నికల్లో కూడా తరమి కొట్టాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
పాలమూరుకు బీజేపీ సర్కారు ఏమిచేసింది..?
ఫెడరల్ ఫ్రంట్ మాట ఎత్తితేనే ప్రధాని మోడీ భయపడుతున్నారని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తానంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ మహబూబ్నగర్కు వచ్చి మాట్లాడారని గుర్తు చేసిన కేసీఆర్... పాలమూరుకు ఎందుకు నిధులు విడుదల చేయలేదని సూటిగా ప్రశ్నించారు.