కేసీఆర్ 'ఫైనల్': ఇరకాటంలో మంత్రి చందులాల్, సీఎంతో తాడోపేడో
హైదరాబాద్: తెలంగాణలో 31 జిల్లాలే ఫైనల్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ములుగు, నారాయణపేట తదితర ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పడే పరిస్థితి వెనక్కి వెళ్లినట్లే. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ తమ ప్రాంతాల పైన పట్టు వీడేందుకు సిద్ధంగా లేరు.
ఇప్పుటికే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సమర్పించారని వార్తలు వచ్చాయి. నారాయణపేటను జిల్లాగా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే, వరంగల్ జిల్లా ములుగును జిల్లాగా చేయాలని మంత్రి చందూలాల్ కోరుతున్నారు.
జిల్లాల ఎఫెక్ట్: మినిస్టర్ చందులాల్ కంటతడి, మంత్రివై ఇలాగా.. కేసీఆర్కానీ కేసీఆర్ 31 ఫైనల్ అని చెప్పడంతో ములుగు జిల్లాగా కాదని అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా పైన ముందుకే వెళ్లాలని మంత్రి అజ్మీరా చందూలాల్ నిర్ణయించారు. జిల్లాకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ములుగుకు ఉన్నప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని వాపోతున్నారు.
తన నియోజకవర్గంలో మసకబారుతున్న ప్రతిష్ఠను నిలబెట్టుకునేందుకు సీఎం కేసీఆర్ వద్దే తేల్చుకోవాలని ఆయన అపాయింట్మెంట్ కోరారని తెలుస్తోంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన పార్టీ ప్రజాప్రతినిధులతో ఇటీవల జరిగిన సమావేశంలో ములుగును జిల్లా చేయాలని మంత్రి చందూలాల్ కోరగా, ఆ జిల్లా గురించి మాట్లాడేది లేదని కేసీఆర్ చెప్పారట. ఆ తర్వాత కొత్తగా 4 జిల్లాలు తెర పైకి వచ్చాయి.
జనగామ, అసీఫాబాద్, గద్వాల, సిరిసిల్లలు తెరపైకి వచ్చాయి. ములుగు జిల్లాపై సీఎం సుముఖంగా లేకపోవడం మంత్రిని ఇరకాటంలో పడేసింది. ములుగుపై అమీతుమీకి సిద్ధపడాలో, రాజీపడి వెనకడుగువేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో మంత్రి ఉన్నారని అంటున్నారు.
నారాయణపేట కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, గద్వాల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యే డీకే అరుణ రాజీనామా చేశారు. ములుగు జిల్లా కోసం అనుచరులంతా మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్నారు. రాజీనామా చేస్తే పార్టీలో, ప్రభుత్వంలో ఇబ్బందులు వస్తాయని, శాంతియుతంగానే జిల్లాను సాధించుకోవాలని భావిస్తున్నారని సమాచారం.