‘బండి’కి తెలీకుండానే పవన్ వద్దకు వారిద్దరూ వెళ్లారా? రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జవదేకర్పై ఫైర్
హైదరాబాద్: నగరానికి ఏం చేశారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు హైదరాబాద్ వరద, బుదరలా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరుతుండటంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం లోపం వల్లే నేతలను తయారుచేసుకోలేక కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కమల దళంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
బండికి తెలియకుండానే కిషన్, లక్ష్మణ్ వెళ్లారా?
ఆదివారం గాంధీభవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనసేనతో పొత్తు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబితే.. ఆయనకు సమాచారం లేకుండానే పవన్ కళ్యాణ్ మద్దతును కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరారా? అని ప్రశ్నించారు. ఇటీవల కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ కావడంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పుకుని, బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్రమంత్రి జవదేకర్ లక్ష్యంగా రేవంత్ ప్రశ్నలు
సీఎం కేసీఆర్పై ఛార్జీషీటు విడుదల చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారని.. అయితే తాను ఆయనపై ఛార్జీషీట్ విడుదల చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. మైహోం సిమెంట్ సంస్థకు పర్యావరణ, అటవీ అనుమతులు లేవని తనతోపాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేస్తే ప్రకాశ్ జవదేకర్ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. శ్రీశైలం, కల్వకుర్త ప్రాజెక్టుల అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ నిలదీశారు.
Recommended Video
ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లండి..
మూసీ నది ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని తనతోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. హుస్సేన్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్తు తీర్పు ఇచ్చిందని, అయినా అక్కడ సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించలేదని రేవంత్ అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే కేంద్రమంత్రి జవదేకర్ ఢిల్లీకి వెళ్లాలన్నారు రేవంత్. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం నగరంలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా మళ్లీ ఓట్లకు వస్తున్నారని మండిపడ్డారు.