ట్రైబల్ హాస్టల్లో ఏం జరుగుతోంది.. ఒక్కరు కాదు ఇద్దరు గర్భవతులు, ఒకరికి 3 నెలలు
ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో బాలికల గర్భానికి సంబంధించి మరిన్ని నిజాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఒక విద్యార్థిని గర్భవతి అని నిర్ధారణ కాగా.. మరో విద్యార్థిని కూడా ప్రెగ్నెంట్ అని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఘటనపై ఐటీడీఏ పీవో స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరారు.
రెండునెలల క్రితం..
ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళ డిగ్రీ కాలేజీ హాస్టల్లో జరిగిన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హాస్టల్లో ఉంటోన్న విద్యార్థినీలు గర్భం దాల్చారనే విషయం ఆందోళనకు గురిచేసింది. పది మంది విద్యార్థినులకు డేట్ సరిగా రావడం లేదు. దీంతో హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు.
ముగ్గురులో ఒకరు, మరొకరు..
పదిమందిలో ముగ్గురికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సిబ్బంది గజ గజ వణికారు. నెలరోజుల తర్వాత మరోసారి తీసుకొస్తే ముగ్గురిలో ఒక్కరే ప్రెగ్నెట్ అని వైద్యులు తెలిపారు. అమ్మాయి గర్భవతి కావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో విద్యార్థిని ప్రెగ్నెట్ అని తెలియడంతో.. హాస్టల్లో ఏం జరుగుతుంది అని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మందమర్రికి చెందిన ఓ విద్యార్థినికి మూడునెలల గర్భవతి అని తెలిసింది.
విచారణ
మిగతా విద్యార్థినులను ఆర్సీవో లక్ష్మయ్య వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగింది, ఎవరెవరు హాస్టల్కు వచ్చారనే అంశాలపై ఆరాతీస్తున్నారు. ఘటన జరిగి రెండునెలలవుతోన్నా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని హాస్టల్ సిబ్బందిపై జిల్లా ట్రైబ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో స్పందించి, విచారణకు ఆదేశించారు.