ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహం
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పార్టీ ఉపాధ్యక్ష పదవులను అర్హత లేని వాళ్లకు ఇస్తున్నారని సుధీర్ రెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. పార్టీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు వద్దని చెప్పారు. నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పెట్టడంతో నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు.
టిక్కెట్లు ఆలస్యం నష్టం చేసింది
అసెంబ్లీ ఎన్నికల్లో ఆలస్యంగా టిక్కెట్లు ఇవ్వడం పార్టీకి నష్టం చేసిందని మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుండేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన చేపట్టిన పథకాలు కూడా కొంత కలిసి వచ్చాయని చెప్పారు. రైతు బంధు, పింఛన్లు పెంచడం బాగా కలిసి వచ్చిందన్నారు.
ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలి
ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి.. రాహుల్ గాంధీని కోరారు. దీనికి రాహుల్ గాంధీ నవ్వుతూ... చూద్దాం..లే అని సమాధానం చెప్పారు. ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తుంటారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. కానీ ఖమ్మం నుంచి పోటీ చేయమని అడిగేసరికి నవ్వుతూ సరేలే అన్నారు.
మాకు స్వేచ్ఛ ఇస్తేనే రీజినల్ పార్టీలను ఎదుర్కోగలం
పొంగులేటి ఇంకా మాట్లాడుతూ... సమన్వయ లోపం కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. అలాగే, తెలుగుదేశం పార్టీతో పొత్తుతో కూడా దెబ్బతిన్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడును బూచీగా చూపి కేసీఆర్ టార్గెట్ చేశారని తెలిపారు. పార్టీలో సమూల మార్పులు రావాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. జాతియ పార్టీ మాదిరిగా కాకుండా రీజినల్ పార్టీలా మారాలన్నారు. రాష్ట్ర పార్టీకి నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అప్పుడే రీజినల్ పార్టీలను ఎదుర్కోగలమని చెప్పారు.