పదవీ విరమణ వయసు పెంపు ఎప్పుడు..! ఉద్యోగుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!!
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ వయోపరిమితి పెంపుపై ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. ఈనెలలో ఉద్యోగ విరమణ పొందే వారు మరింత టెన్షన్ కు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ముందస్తు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాని ఇంతవరకు ఆ ఫైల్ ను కదిలించిన దాఖలాలు లేకపోవడంతో రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న ఉద్యోగుల్లో నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..! పదవీ విరమణ చేసే ఉద్యోగులను ఆదుకోవాలి..!
ఉద్యోగుల వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచుతామని గులాబీ పార్టీ మానిఫెప్టోలో పొందుపరిచింది. ఈనెల 13న రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఉద్యోగులంతా వయోపరిమితి పెంపునకు సంబంధించి చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల వయోపరిమితి 58 ఏళ్లకు నుంచి 60 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఏపీ ఉద్యోగులకు ఇది అమలవుతున్నది కూడా. వయోపరిమితిని తర్వాత పెంచితే ఈనెలలో ఉద్యోగ విరమణ పొందేవారు నష్టపోయే ప్రమాదముంది. అందుకే వయోపరిమితి ఉత్తర్వులు ఎప్పుడు విడుదలవుతాయా అని ఉద్యోగ విరమణ పొందే వారిలో ఉత్కంఠ నెలకొంది.
సీఎం నిర్ణయం కోసం అంతా ఎదురుచూపు..!వెంటనే ఉత్తర్వులివ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్..!!
అంతే కాకుండా ఈనెలలోనే 426 మంది, జనవరిలో 605 మంది, ఫిబ్రవరిలో 469 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం ఉద్యోగులతోపాటు ఉద్యోగ సంఘాల నేతలూ ఎదురుచూస్తున్నారు. టీఎన్జీవో నేతలు వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశం పై ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఢిల్లీ పర్యటన తర్వాత కలిసే అవకాశముందని, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార అంశాల్లో చంద్రశేఖర్ రావు తీరిక లేకుండా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈనెలలో వయోపరిమితి పెంపు ఉత్తర్వులు వచ్చే అవకాశం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.
సమ్మె కారణంగా ఈ రోజుకూడా బ్యాంకులు బంద్..!! ఇబ్బంది పడుతున్న ఖాతాదారులు..!!
పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉత్తర్వులు.! ఉసూరుమంటున్న ఉద్యోగులు..!!
పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉద్యోగ వయోపరిమితి పెంపు ఉత్తర్వులు వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. ఏప్రిల్లోనే పార్లమెంటు ఎన్నికలున్నాయి. రిటైరయ్యే వేల మంది ఉద్యోగుల కోసం లక్షల మంది నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత తెచ్చుకుంటారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇటు ఉద్యోగులు, అటు నిరుద్యోగుల్లో అసంతృప్తి రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ఎన్నికల మ్యానిఫెస్టో అనేది ఐదేండ్ల కాలంలో అమలు చేసే అంశం. అంతేకాని ప్రభుత్వం వెంటనే చేయాల్సిన అవసరమూ లేదని పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలే అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగులు నష్టపోకుండా చూడాలి..! రెట్టింపవుతున్న అసహనం..!!
ఉద్యోగులు నష్టపోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రిటైరయ్యే వారు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో సీఎంను కలిసి వయోపరిమితి పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరతామని టీఎన్జీవో అధ్యక్షులు కారం రవీందర్రెడ్ది వన్ ఇండియాతో చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మనసులో ఏముందో ఎవరికీ తెలియదనీ, అందుకే ఉద్యోగులకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతూ ఆర్డినెన్స్ను వెంటనే జారీ చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రశేఖర్ రావు దేశ పర్యటనలు తర్వాత ఇదే అంశం పై ఎంత వేగంగా స్పందిస్తారో చూడాలి.