మారుతీరావు ఆత్మహత్య : పురుగుల మందు ఎక్కడ కొన్నాడు.. వీలునామాపై అనుమానాలు..
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సోదరుడు శ్రవణ్తో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను శ్రవణ్ ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల మారుతీరావు వీలునామాలో సోదరుడి పేరును తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ప్రస్తుతం వీలునామాపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు.'
Recommended Video
పురుగుల మందు ఎక్కడ కొన్నాడు..
ఆత్మహత్య చేసుకోవాలని మారుతీరావు ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శనివారం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మారుతీరావు.. అంతకంటే ముందు నల్గొండకు వెళ్లాడు. అక్కడ ఎప్పుడూ కలిసే ఓ ఫర్టిలైజర్ షాపులోని మిత్రుడి వద్దకు వెళ్లాడు. చాలా ఏళ్లుగా మారుతీరావుకు అదే అడ్డా. అదే షాపులో మారుతీరావు పురుగుల మందు బాటిల్ను కొనుగోలు చేశాడు. కారులో హైదరాబాద్కు వస్తున్న సమయంలో పురుగుల మందు బాటిల్ గురించి డ్రైవర్ ఆరా తీశాడు. అయితే ఇంటి వద్ద చెట్లకు కొట్టేందుకు తీసుకున్నానని మారుతీరావు చెప్పినట్టు సమాచారం.
పానీపురి తిని వచ్చాక.. గదిలోకి వెళ్లిపోయాడు..
హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు గది అద్దెకు తీసుకున్నాడు. కాసేపటికి డ్రైవర్తో కలిసి బయటకు వెళ్లి పానీపురి తిన్నాడు. అనంతరం డ్రైవర్ను కారులోనే పడుకోమని చెప్పి.. తాను మాత్రం గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు ఓ న్యాయవాదిని కలిసేందుకు వెళ్లాలని.. ఉదయం సిద్దంగా ఉండాలని డ్రైవర్తో చెప్పాడు. మారుతీరావు చెప్పినట్టే.. డ్రైవర్ ఉదయాన్నే సిద్దమై అతన్ని లేపేందుకు గదిలోకి వెళ్లాడు. మారుతీరావును లేపేందుకు ప్రయత్నించగా.. ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బందికి విషయం చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి మంచంపై అతను విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు.
పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదన్న శ్రవణ్
ఉస్మానియాలో పోస్టుమార్టమ్ పూర్తయిపోవడంతో మృతదేహాన్ని మిర్యాలగూడకు తరలించే ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో మిర్యాలగూడలోని మారుతీరావు, అమృత ప్రణయ్ల ఇళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుతీరావు బస చేసిన హోటల్ గదిలో క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మారుతీరావు సోదరుడు శ్రవణ్ మాట్లాడుతూ.. కేసులో ట్రయల్ పూర్తయిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మారుతీరావు పశ్చాత్తపడ్డారా అని మీడియా అడగ్గా.. పశ్చాత్తపం చెందాల్సిన అవసరం లేదని కేసు గురించే ఆందోళన చెంది ఉంటాడని అన్నారు. ఏడాది కాలంగా అన్నతో తనకు మాటల్లేవని.. కాబట్టి ఆయన ఆత్మహత్యకు సంబంధించి తనకెలాంటి వివరాలు తెలియవన్నారు.
వీలునామాపై అనుమానాలు..
ప్రణయ్ హత్యకు ముందు 2018 మార్చిలో మారుతీరావు ఆస్తి వీలునామా రాశాడు. అందులో తన సోదరుడు శ్రవణ్కు కూడా ఆస్తి పంపకాలు చేశాడు. అయితే జైలు నంచి విడుదలై బయటకొచ్చాక.. ఇటీవల వీలునామా నుంచి శ్రవణ్ పేరును తప్పించాడు. తాజాగా మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో ఈ వీలునామాపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోదరుడు శ్రవణ్ ఆస్తి కోసం వేధిస్తున్నందువల్లే మారుతీరావు చనిపోయాడన్న ఆరోపణలు తెర పైకి వచ్చాయి. అయితే శ్రవణ్ మాత్రం తానే పట్టుబట్టి వీలునామా నుంచి పేరును తొలగించుకున్నానని చెబుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ లేనిపోని కేసులు వెంటాడుతాయన్న భయంతో తానే పట్టుబట్టి వీలునామాలో తన పేరును తొలగించుకున్నట్టు చెప్పారు. తనకున్న ఆస్తులు చాలు అని.. పోయేటప్పుడు ఏమీ వెంటబెట్టుకుని వెళ్లమని అన్నారు. మరోవైపు నల్గొండలోని న్యాయవాదులు కూడా మారుతీరావు కేసులో అండగా నిలబడేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో సరైన న్యాయవాది దొరక్క మారుతీరావు సతమతమయ్యాడన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద మారుతీరావు అనుమానాస్పద మృతి ప్రస్తుతానికి చిక్కుముడిగానే ఉంది.