వడ్డీలేని పంటరుణాల పథకం ఉన్నట్టా..? లేనట్టా..? రైతన్నలకు నోటీసులిస్తున్న బ్యాంకులు..!!
Recommended Video
హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు అప్పుల బాధలు మొదలయ్యాయి. పాత పంట రుణాల బకాయిలను వడ్డీతో సహా కట్టాలని అన్నదాతలకు అన్ని బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. సహకార బ్యాంకులు ఇంతకాలం వడ్డీ వసూలు చేయలేదు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం వడ్డీ సొమ్ము విడుదల చేయడం లేదని, ఇప్పుడిక వడ్డీతో సహా పాత బకాయిలు వసూలు చేయాలని 'జిల్లా కేంద్ర సహకార బ్యాంకు'(డీసీసీబీ)లకు 'తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు'(టీఎస్క్యాబ్) సైతం తాజాగా సూచనలిచ్చినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ గేటు దాటని సర్కార్ పథకాలు..! శెరలు పడుతున్న రైతులు..!!
పంట రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ‘వడ్డీ లేని పంటరుణం'(వీఎల్ఆర్) అనే పేరుతో ప్రత్యేక పథకాన్ని వ్యవసాయ శాఖ అమలు చేస్తోంది. రూ.లక్ష వరకూ పంట రుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోగా తిరిగి బ్యాంకుకు రైతు చెల్లిస్తే దానిపై పడే వడ్డీని రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకులకు ఇస్తుందనేది ఈ పథకం నిబంధన. ఇలాగే లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకూ రుణం తీసుకుంటే దానినీ ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే పావలా వడ్డీని రైతు చెల్లిస్తే సరిపోతుందని చెప్పుకొస్తోంది.
ప్రభుత్వ ప్రకటనలతో సంబందం లేదంటున్న బ్యాంకర్లు..! ఆకాశాన్నంటుతున్న రైతన్నల గోస..!!
వీఎల్ఆర్ అమల్లో ఉందని.. అన్నదాతల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వ్యవసాయశాఖ ఉత్తర్వు(జీవో) విడుదల చేయాలి. కానీ 2018-19 సంవత్సరానికి సంబంధించి ఈ పథకం అమలులో ఉందని ఇంతవరకూ జీఓనే విడుదల చేయలేదు. మరోవైపు శాసనసభ ఎన్నికల్లో గెలిస్తే లక్ష రూపాయల వరకూ పంట రుణంమాఫీ చేస్తామని గులాబీ పార్టీ హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు. వడ్డీ లేని పంట రుణం పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేయకపోవడం.. పంట రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన ఇవ్వకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
వడ్డీ కట్టాల్సిందే అంటున్న బ్యాంకులు..! అదే బాటలో సహకార బ్యాంకులు..!!
కోడ్ ముగిశాక రుణమాఫీ నిధులు వస్తాయన్న ఆశతో అన్నదాతలు ఉన్నారు. గత నెలాఖరుతో 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసింది. పైగా 2018 ఖరీఫ్ సీజన్ కోసం 2018 ఏప్రిల్ నుంచి పంటరుణాలు తీసుకున్న వారి ఏడాదికాలం గడువు కూడా ప్రస్తుతం ముగిసింది. పంటరుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా చెల్లించనివారికి వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని వసూలుకు నోటీసులిస్తున్నట్లు ఓ బ్యాంకు మేనేజర్ వివరించారు.
రెండేళ్లుగా నత్తనడకన..! ఉసూరుమంటున్న రైతన్నలు..!!
వీఎల్ఆర్ పథకం అమలు తీరు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఉదాహరణకు 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లోనూ ఈ పథకం అమల్లో ఉందని వ్యవసాయ శాఖ ఏటా ఉత్తర్వులిచ్చింది. కానీ బ్యాంకులకు నిధులు విడుదల చేయలేదు. దీంతో వాణిజ్య బ్యాంకులు పాతబకాయిని వడ్డీతో సహా వసూలు చేశాయి. వ్యవసాయశాఖ తిరిగి నిధులు తమకు ఇస్తే రైతుల బ్యాంకు ఖాతాల్లో వడ్డీ సొమ్మును వాపస్ చేస్తామని తెలిపాయి. ఈ మేరకు తాము 500 కోట్ల రూపాయలకు పైగా వడ్డీ పేరుతో అన్నదాతల ఖాతాల్లో వేయాల్సి ఉందని, ప్రభుత్వం ఇస్తే వెంటనే వేస్తామని పలుమార్లు బ్యాంకర్లు వ్యవసాయశాఖను అడిగారు. కానీ రెండేళ్ల వీఎల్ఆర్ బకాయిలు బ్యాంకులకు ఇవ్వలేదు. పాత బకాయిలు రాకపోగా, ఇక 2018-19కి అసలు పథకం అమల్లో ఉందని జీఓ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వడ్డీ వసూలు చేయకుండా ఎలా ఉండగలమని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పుకు రావడం శోచనీయం.