తెలంగాణలో బీజేపి దారెటు..! ఎన్నికలు ముంచుకొస్తున్నా యాక్షన్ లో లేని కాషాయ పార్టీ..!!
హైదరాబాద్: తెలంగాణలో బీజేపి పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో యాక్షన్ లోకి దిగినట్టు కనిపించడం లేదు. ముందస్తు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఇతర పార్టీల నేతలు అభ్యర్తుల ఎంపిక, పొత్తులు, అదికార పార్టీ ని గద్దె దించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో తలమునకలై కనిపిస్తుంటే బీజెపి మాత్రం కూల్ కూల్ గా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో అదికారంలో ఉన్న బీజేపి, రాష్ట్రంలో కాడా పార్టీని ఒడ్డున పడేస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా భావసారూప్యత ఉన్న యువ తెలంగాణ పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కూడా ఆ పార్టీ అదిష్టానం సుముఖత చూపించకపోవడం కొసమెరుపు. దీంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కదలికలు అంతంగా మారిపోయాయని చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుండి కేందమంత్రులు గాని, పార్టీ జాతీయ అద్యక్షుడు అమీత్ షా వచ్చినప్పుడు మాత్రమే పార్టీలో హడావిడి కనిపిస్తోందని, మిగతా సమయంలో చేష్టలుడిగినట్టు పార్టీ పరిస్థితి తయరయ్యిందనే చర్చ జరుగుతోంది.
ముందస్తు ముంచుకొచ్చింది..! బీజేపి పార్టీ కార్యక్రమాలు మాత్రం నిల్..!!
తెలంగాణలో జరగబోయే ముందుస్తు ఎన్నికల నేపధ్యంలో యువ తెలంగాణతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. తెలంగాణలో ఎంతమాత్రం బలం లేని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు పొత్తు అంశంపై మరోమారు ఆలోచించాలని పార్టీ పెద్దలకు జిల్లా నేతలు సూచించినట్టు సమాచారం. కాగా యువ తెలంగాణతో పొత్తు పెట్టుకోవాలనే యోచనతోనే రెండు జాబితాల్లో భువనగిరి, మహబూబ్నగర్, జనగామ, నర్సంపేటలతో పాటు మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదనే వార్తలు వినిపించాయి.
యువ తెలంగాణ అప్పుడు ముద్దు..! ఇప్పుడు మాత్రం ఒద్దు..!!
దీనికితోడు యువ తెలంగాణ పార్టీ 10 స్థానాలు కోరుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఆయా స్థానాలను ఆశించిన యువ తెలంగాణ పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులు బీజేపీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. భువనగిరి సీటును యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డికి ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉందనే వార్తలు వినిపించాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ పార్టీ ముఖ్యనేతలతో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది.
బీజేపికి సమానంగా యువతెలంగాణ..! ఆ పార్టీ ఊసే ఒద్దంటున్న ఢిల్లీ పెద్దలు..!!
అంతే కాకుండా బీజేపీకి రాజీనామా చేసిన కొంతమంది నేతలు యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో మహబూబ్నగర్, జనగాం స్థానాల నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి నెదుర్కొన్న కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఎన్నెం శ్రీనివాసరెడ్డి యువ తెలంగాణ తరపున పోటీకి దిగాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదిలావుండగా బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ ప్రకాష్ నడ్డాతో జిల్లా నేతలు అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు సమాచారం.
ప్రస్తుతం పొత్తు లేదు..! ఎన్నికల తర్వాత చూద్దాం అంటున్న నాయకులు..!!
అయితే ఈ అంశాన్ని సదరు ఇన్చార్జ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా జనగామ, భువనగిరి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన కీలక నేతలు యవ తెలంగాణతో పొత్తు కుదుర్చుకోవడాన్ని జేపీ నడ్డా వ్యతిరేకించినట్టు సమాచారం. పైగా అలాంటి పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల బీజేపీకి కలిగే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇదే సమయంలో యువ తెలంగాణ పొత్తు అంశంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ఎన్నికల్లో బీజెపి ఏ పార్టీ తో కలిసి ముందుకు వెళ్తుందనే అంశం సస్పెన్స్ గా మారింది.