కేసీఆర్ దూరం ఉంచినా.. హరీశ్ మనసంతా అక్కడే ...
హైదరాబాద్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీ రోల్ పోషించినా మాజీ మంత్రి హరీశ్రావు.. రెండో విడత ఎమ్మెల్యేగానే పరిమితమయ్యారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లోకి తీసుకోకపోవడంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం గతంలో చేసిన పలు మంచి పనులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, చెరువుల పునరుద్ధరణ కోసం పాటుపడ్డ హరీశ్ రావు .. మిషన్ కాకతీయ పథకాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.
హరీశ్ ట్వీట్ ..
నీటి వనరుల పునరుద్దరణలో దేశంలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచింది. దీనిని గుర్తుచేస్తూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే మిషన్ కాకాతీయకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇందుకోసం కృషిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాగునీటి రంగంలో సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శనీయమని గుర్తుచేశారు. ఇదంతా విసృత భాగస్వామ్యంతోనే విజయవంతమైందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ కాకతీయ స్పూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. హరీశ్ ట్వీట్ పొలిటికల్ సర్కిళ్లలో చర్చానీయాంశమైంది.
దూరం .. దూరంగా ...
గత డిసెంబర్ ఎన్నికలు, ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. తొలుత కేసీఆర్, మహమూద్ అలీతో మంత్రివర్గం కొలువుదీరింది. తర్వాత మంత్రివర్గ విస్తరణలో హరీశ్, కేటీఆర్ ఇతరులకు కేసీఆర్ చోటు కల్పించలేదు. అయితే హరీశ్కు బెర్త్ ఇవ్వకపోవడంపై బాహాటంగానే నిరసనలు వ్యక్తమైనా .. అనుచరులు ఆందోళన చెందొద్దని స్వయంగా హరీశ్రావే పేర్కొన్నారు. కానీ ఇన్నాళ్లకు తాను చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నడం చర్చకు దారితీసింది. దీనికి అర్థం, పరామర్థం ఏంటి అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. తన హయాంలో జరిగిన మంచి పనికి తెలియజేయాలనే ఉద్దేశం తప్పులేదు .. కానీ దానికి తోడు మిగతా అర్థాలు ఉన్నాయా అనే అంశం మాత్రం సామాన్యుల మెదడు తొలచివేస్తోంది.
ఎన్నాళ్లకెన్నాళ్లకు ..
రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాక హరీశ్రావు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వానికి సమానదూరం పాటిస్తున్నారు. ఆయన అనుచరులు, అభిమానులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఇన్నాళ్లకు హరీశ్ .. మిషన్ కాకతీయ పథకం గురించి ప్రస్తావించడం .. ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. దీని పేరు చెప్పి ఆయన ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతుంది. అయితే తాను ఓ క్రమశిక్షణ కలిగిన సైనికుడినని హరీశ్ ఇదివరకే చాలాసార్లు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.