జగన్ వెరీ క్లియర్!: చంద్రబాబు చెప్పిందే నిజమా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవేగౌడ, కుమారస్వామి, స్టాలిన్, కరుణానిధిలను కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా కేటీఆర్ వైసీపీ అధినేత వైయస్ జగన్ను కూడా కలిశారు.
"జగన్కు కేసీఆర్ మద్దతిస్తే ఏంటి, బాబుకు అధికారం ఉంటే ఏంటి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ!!"
ఆ నేతల వ్యాఖ్యలు నిజమవుతున్నాయా?
అప్పుడు కేసీఆర్ బెంగళూరు, భువనేశ్వర్, కోల్కతా, ఢిల్లీకి వెళ్లి వివిధ పార్టీల నేతలను కలిశారు. ఎన్నికల్లోపు థర్డ్ ఫ్రంట్ రూపుదాలుస్తుందని చెప్పారు. కానీ ఆ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. బయటకు మాత్రం ఏమీ కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ దక్కకుంటే అప్పుడు ఈ కూటమి గురించి ఆలోచిస్తారా తెలియాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం కదలిక లేనట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ థర్డ్ ప్రయత్నాలపై టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలతో పాటు రేవంత్ రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ అంతా వట్టిదేనని, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.
ఎందుకు మౌనంగా ఉన్నారు?
తొలుత థర్డ్ ఫ్రంట్ అని హడావుడి చేసి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. లోకసభ ఫలితాలు వచ్చాక దానిని బట్టి ముందుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే కొద్ది నెలల క్రితం వరకు ప్రీపోల్ సర్వేల్లో తెలంగాణలో తెరాసకు తిరుగులేదని, ఏపీలో తమ సన్నిహిత పార్టీ వైసీపీకి 22 సీట్లు వస్తాయని తేలాయి. కానీ ఆ తర్వాత సర్వేల్లో వైసీపీకి సీట్లు తగ్గినట్లుగా తేలింది. టీడీపీ బలం పెరిగింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ బలం కూడా క్రమంగా పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం అడుగు వేయాలని చూస్తున్నారా తెలియాల్సి ఉంది.
బీజేపీయేతర కూటమి
ప్రస్తుతం జాతీయస్థాయిలో ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వైపు ఎక్కువ పార్టీలు ఉన్నాయని, అందువల్లే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఎన్నికల తర్వాతకు వాయిదా పడి ఉంటుందని అంటున్నారు. బీజేపీ ఓవైపు, బీజేపీయేతర పార్టీలు ఓ వైపు అంటూ చంద్రబాబు వంటి నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. కేసీఆర్, పవన్ కళ్యాణ్, జగన్లను కూడా చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిలోకి వస్తే తీసుకుంటామని చెప్పారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ కూటమిలో చేరేందుకు జగన్ ఆసక్తిగా లేనట్లుగా కనిపిస్తోంది. ఆయనతో కేటీఆర్ థర్డ్ ఫ్రంట్ చర్చలు జరిపారు. మరోవైపు, ఏపీకి హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో మద్దతిస్తామని జగన్ స్పష్టంగా చెప్పారు.