ఉక్కు పరిశ్రమ ఏదీ ? గిట్టుబాటు ధర ఏమైంది : కేసీఆర్పై రేణుకా ఫైర్
ఖమ్మం : మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తోండగా .. ఓటర్ల మది దోచుకునేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ అంశాలపై అధికార, విపక్షాల మధ్య మాటాల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ రేణుకాచౌదరి రోడ్ షో నిర్వహించారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆమె విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ .. నియంత
రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు రేణుకాచౌదరి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ఉండాలని .. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ దొర విపక్షాన్ని లేకుండా చేస్తున్నారని .. ఇది సరికాదని విమర్శించారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏదీ ?
సీఎం కేసీఆర్ సహా కీలక నేతలు తమకు ప్రజలపై ఏనలేని అభిమానం ఉందని కలరింగ్ ఇస్తుంటారు. ప్రజా సంక్షేమం అని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటారు. కానీ బయ్యాం ఉక్కు పరిశ్రమ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో ఉక్కు పరిశ్రమను ఎందుకు నెలకొల్పలేదని నిలదీశారు.
గిట్టుబాటు ధర అడిగితే బేడీలు వేస్తారా ?
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వమని అడిగితే బేడీలు వేస్తారా అని ప్రశ్నించారు రేణుకాచౌదరి. రైతులను రాజు చేస్తామని చెప్పి బేడీలు వేయించడం ఏంటని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ చెప్పెదొకటి, చేసేదొకటి అని అర్థమైందని విమర్శించారు.
కారు గాలి తీస్తాం ?
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ కారు జోరుమిదుంది. కానీ ఆ తర్వాత బలవంతంగా చేపడుతోన్న చేరికలను రేణుకా విమర్శించారు. ఈ అంశాన్ని ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్దిచెబుతారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కారు గాలి తీసేది .. హస్తమేనని స్పష్టంచేశారు రేణుకాచౌదరి.