ప్రజాస్వమ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిది..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్..!!
హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్మన్, ఛైర్ పర్సన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలపై ఆయన మాట్లాడారు.
మార్పుడు రాజకీయాలను ప్రారంభించిందే ఆ పార్టీ అని కాంగ్రెస్ను విమర్శించారు. 2004 ఎన్నికల్లో 26 మంది తెరాస ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఆ పార్టీలో కలుపుకోలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో మూడింట రెండొంతుల మంది లేకపోయినా సరే నిరంకుశంగా వ్యవహరించలేదా? అని నిదీశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకోవడం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఆ పార్టీ నేతలకు గుర్తు రాలేదా? అన్నారు.
వాళ్లతో పోలిస్తే మేం చాలా మర్యాదగా వ్యవహరించామన్నారు. సీఎల్పీ విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారని, అందులో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. విలీనంపై కాంగ్రెస్ నేతలు కోర్టుకెళుతుండడంపై ప్రశ్నించగా.. ఏం జరుగుతుందో చూద్దాం అని సమాధానమిచ్చారు. 32 జిల్లా పరిషత్లకు గానూ అన్నింటా టీఆర్ఎస్ గెలుపొందిందని, ఇంతటి ఏకపక్ష విజయం అందించినందుకు ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తెరాస కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. 32 జిల్లా పరిషత్లతో పాటు, 85 శాతానికి పైగా ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పిన ఆ రెండు ప్రధాన పార్టీలు.. దారుణ ఓటమి చవిచూశాయన్నారు. ఆరు జిల్లాల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికలో టీఆర్ఎస్ సామాజిక సమతూకం పాటించిందన్నారు. 50 శాతానికి పైగా ఛైర్మన్ స్థానాలను వెనుకబడిన వర్గాలకు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని విజేతలకు సూచించారు.గ్రామస్వరాజ్యం సాధనే లక్ష్యంగా పనిచేయాలని ఎన్నికైన అభ్యర్థులకు సూచించారు.