డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎక్కడ దరఖాస్తు చేయాలి?
హైదరాబాద్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చింది. అయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈక్రమంలో రెండోసారి ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించింది. బంపర్ మెజారిటీతో మళ్లీ టీఆర్ఎస్ పీఠమెక్కడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు చాలామంది క్యూ కడుతున్నారు.
అదలావుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీసేవ లో అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుందని తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్ రావు. 35 రూపాయలు చెల్లించి కావాల్సిన వివరాలు పూర్తిచేసి రశీదు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అన్నీ దరఖాస్తులు పరిశీలించి గవర్నమెంట్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.
దాదాపు వారం, పది రోజులుగా కలెక్టర్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్పెషల్ కౌంటర్లు తెరిచారు. అయినా కూడా జనాలు వీపరీతంగా వస్తుండటంతో మీసేవ లో దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.