నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక: ఎత్తుకు పైఎత్తులో టీఆర్ఎస్, కాంగ్రెస్
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు సీట్లు గెలుచుకున్నాయి. సీపీఎం ఒక సీటు గెలవడంతో కాంగ్రెస్ కూటమి మున్సిపాలిటీ హస్తగతం చేసుకోనుందనే ఊహాగానాల నేపథ్యంలో తెరపైకి ఎక్స్ అఫిషియో ఓట్ల వచ్చాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిన్న ఉదయం నుంచి వాయిదాపడుతూ వస్తోంది. మరికాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పై చేయి సాధిస్తోందా..? విపక్ష కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకొంటుందా అనే అంశం చర్చకు దారితీసింది.
కేవీపీ ఓటుతో..
నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావును ఎక్స్ అపిషీయో సభ్యునిగా తీసుకురావడంతో.. టీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కదిపింది. తమ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా ఎక్స్ అఫిషియో సభ్యులు అనడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కేవీపీని తీసుకురావడంతో హస్తగతం అవుతుందనే ఉత్కంఠతో టీఆర్ఎస్ కూడా వేగంగా స్పందించింది. సుభాష్ రెడ్డికి ఓటుహక్కు కల్పించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదీ ఉత్తమ్ వాదన
ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఓటు హక్కు కల్పించడం ఏంటి అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు. దీనిపై ఆయన ఈసీకి లేఖ రాశారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు కేవీపీ ఓటు అమలుకాకపోవడంపై ఈసీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కేవీపీ రామచంద్రారావు ఓటుతోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదాపడింది.
కేవీపీ లానే సుభాష్ రెడ్డికి..
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అపిషీయో ఓటుకు సంబంధించి కేవీపీకి ఎలా ఓటు కల్పిస్తారో.. శేరి సుభాష్ రెడ్డికి కూడా అలాగే ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఈ మేరకు ఈసీకి లేఖ కూడా రాసింది. మరోవైపు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హైప్ తీసుకొచ్చింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు వేయడం, మున్సిపల్ కమిషనర్ మహేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది. మరికాసేపట్లో జరిగే చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందనే అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.