అంతా మీ దయ!: మేయర్ పీఠం రేసులో కె కేశవ రావు కూతురు?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తే... అప్పుడు మేయర్ పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి.. ఇలా ఎవరికి వారు తమ పార్టీ మేయర్ పదవి కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు.
తెరాస కూడా తాము 75 నుంచి 85 డివిజన్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాము చెబుతున్నట్లుగా అన్ని స్థానాలు గెలిస్తే.. పార్టీలో మేయర్ పీఠం ఎవరిని వరిస్తుంది? అనే చర్చ కూడా అప్పుడే ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాసలో చేరి మంత్రి అయ్యారు. ఆయన తన కొడుకును మేయర్గా చేసేందుకే కారు ఎక్కారని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. తెరాస ముఖ్యనేత కే కెశవ రావు కూతురు పేరు కూడా తాజాగా వినిపిస్తోంది.
కేశవ రావు కూతురు కొన్నాళ్ల క్రితం తెరాసలో చేరారు. ప్రస్తుతం ఆమెను గ్రేటర్ బరిలో కార్పోరేటర్గా నిలబెట్టనున్నారని తెలుస్తోంది. ఆమెను కార్పోరేటర్గా పోటీ చేయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెరాసకు సొంతంగా మెజార్టీ లభిస్తే తన కూతురిని మేయర్ చేయాలని కేశవ రావు భావిస్తున్నారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చెవిలో వేశారని కూడా అంటున్నారు. కెకె ప్రతిపాదనకు కెసిఆర్ సానుకూలంగా స్పందంచారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు, కొద్ది రోజుల క్రితం టిడిపి ముషీరాబాద్ ఇంఛార్జ్ ముఠా గోపాల్ను ఉద్దేశించి హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఠా గోపాల్ కార్పోరేటర్గా గెలిస్తే మేయర్ పదవిని వదిలేటట్టు లేడు అన్నారు. దానికి ముఠా గోపాల్ స్పందిస్తూ... శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. అంతా మీ దయ అన్నారట.