పట్టాభిషేకం కేటీఆర్కా? సంతోష్కా?.. ఎంపీ అరవింద్ సంచలన పోస్ట్... టీఆర్ఎస్లో అసలేం జరుగుతోంది?
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ సంచలన పోస్టు పెట్టారు. 'పట్టాభిషేకం సంతోష్కా లేక కేటీఆర్కా..' అంటూ ఆయన పెట్టిన పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత రెండు వారాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించట్లేదని,ఆయన ఆరోగ్యంపై వివరణ ఇవ్వాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న తరుణంలో అరవింద్ ఈ పోస్టు పెట్టడం గమనార్హం. అయితే ఎంపీ అరవింద్ ఏ ఉద్దేశంతో ఇప్పుడీ పోస్టు పెట్టారన్న దానిపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. కేసీఆర్ తర్వాత కేటీఆరే... అని అంతా ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో కొత్తగా సంతోష్ పేరు తెర పైకి రావడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్హౌజ్లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?
అప్పట్లోనే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారం..
నిజానికి డిసెంబర్,2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని... అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని అప్పట్లో చాలానే కథనాలు వచ్చాయి. ఆ తర్వాత పార్టీని వీడిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ సన్నిహితులు పలు సందర్బాల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ ఈ ప్రచారాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆరే ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. అయినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతీసారి కేటీఆర్ను ముఖ్యమంత్రి పీఠంపై ఎప్పుడు కూర్చోబెడుతున్నారన్న చర్చ తెర పైకి వస్తూనే ఉంది. కానీ అటు కేసీఆర్ గానీ ఇటు కేటీఆర్ గానీ ఈ ప్రచారాలను ఖండిస్తూ వస్తున్నారు. మరో 15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామని చాలా సందర్భాల్లో కేటీఆరే స్వయంగా వెల్లడించారు.
హరీష్ రావు-కేటీఆర్... అప్పటి పరిస్థితి...
ఒకవేళ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే... ఉద్యమ ప్రస్థానం నుంచి అధికారంలోకి వచ్చేవరకూ తొలినుంచి నమ్మిన బంటులా కేసీఆర్ వెంటే ఉన్నా హరీష్ రావు పరిస్థితేంటన్న చర్చ అప్పట్లో చాలానే జరిగింది. కేసీఆరే ట్రబుల్ షూటర్ అని పేరు పెట్టి... మొదటి నుంచి తన తర్వాత పార్టీలో హరీష్ రావుకే అన్ని విధాలా ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్... ఇప్పుడు కుమారుడి కోసం మేనల్లుడిని పక్కనపెడుతున్నారన్న ప్రచారం జరిగింది. కేటీఆర్కు లైన్ క్లియర్ చేసే క్రమంలో పార్టీలో,ప్రభుత్వంలో హరీష్ రావు ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. దీంతో హరీష్ రావు పార్టీని చీలుస్తారు.. బయటకు వెళ్లిపోతారు.. అని ప్రతిపక్షాలు సైతం సంచలన వ్యాఖ్యలు చేశాయి. కానీ హరీష్ మాత్రం ఎప్పటిలాగే అదే చిరునవ్వుతో వాటన్నింటిని ఖండించారు. కేసీఆర్ మాటే తనకు శిరోధార్యం అని ప్రకటించారు. అయితే హరీష్ పైకి అలా చెబుతున్నప్పటికీ... మేనమామను ధిక్కరించలేక లోలోపల మదనపడుతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.
అకస్మాత్తుగా తెర పైకి సంతోష్ పేరు...
నిన్న మొన్నటిదాకా హరీష్,కేటీఆర్లలో ఎవరు తదుపరి ముఖ్యమంత్రి అన్న చర్చ జరగ్గా... ఇప్పుడు అకస్మాత్తుగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు పేరు కూడా తెర పైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మొదట్లో కేసీఆర్ పీఏగా పనిచేస్తూ పార్టీ నాయకులకు,అధినేతకు మధ్య సమన్వయం నెరిపిన సంతోష్.. చాలా కాలం పాటు తెర వెనుకే ఉన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా మూడేళ్ల పాటు పార్టీలోనూ కీలక పదవి దక్కలేదు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన... పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అయినప్పటికీ 'గ్రీన్ ఛాలెంజ్' అంటూ అప్పుడప్పుడూ టీవీల్లో కనిపించడం మినహా ఆయన లో ప్రొఫైల్నే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
సంతోష్ కేటీఆర్కు పోటీగా మారారన్న ప్రచారం...
రాజకీయాల్లో తమ తర్వాత తమ వారసులను ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర భారత రాజకీయాల్లో దాదాపుగా ప్రతీ చోటా కనిపిస్తుంది. తెలంగాణలోనూ కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అని ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు కూడా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అలాంటిది.. అకస్మాత్తుగా సంతోష్ పేరు తెర పైకి రావడమే ఎవరికీ అంతుచిక్కడం లేదు. నిన్న,మొన్నటిదాకా బావ హరీష్ రావు నుంచి పోటీని ఎదుర్కొన్న కేటీఆర్... ఇప్పుడు సోదరుడు సంతోష్ నుంచే పోటీని ఎదుర్కొంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అంతేకాదు,ఇటీవల జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్నానని చెబుతున్న జన్వాడ ఫామ్ హౌస్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిజ నిర్దారణకు కమిటీని నియమించిన సందర్భంలో... అసలు ఆ ఫామ్ హౌస్ అక్రమాల రహస్యాలను లీక్ చేసింది సంతోష్ రావే అంటూ మల్లన్న పెద్ద బాంబు పేల్చాడు. కేటీఆర్కు సంతోష్ రావు రూపంలో గట్టి పోటీ ఎదురవుతోందని... కేసీఆర్ సైతం సంతోష్ వైపే మొగ్గుచూపుతున్నాడని అన్నారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ విభేదాలపై చర్చ మొదలైంది.
Recommended Video
ఎంపీ అరవింద్ పోస్టు వెనుక ఆంతర్యమేంటి...
తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పట్టాభిషేకం సంతోష్కా,కేటీఆర్కా అని ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం పెద్ద దుమారమే రేపుతోంది. ఒకటి... కేసీఆర్ కుటుంబంలో విబేధాలను బయటపెట్టేందుకే ప్రతిపక్షాలు ఈ రకమైన వ్యూహాన్ని అమలుచేస్తున్నాయా అన్న సందేహమైతే... మరొకటి... నిజంగానే కేసీఆర్ సంతోష్ రావును ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడా అన్న సందేహం. ఎప్పుడూ ప్రతిపక్షాలు,మీడియా అంచనాలకు అందని రీతిలో నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. ఈ విషయంలోనూ అనూహ్య నిర్ణయమే తీసుకుంటారేమోనన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఇంకొకరిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది... ఎంపీ అరవింద్ ఈ పాయింట్ను ఎందుకు తెర మీదకు తెచ్చారన్నది అంతు చిక్కడం లేదు. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తుతున్న తరుణంలో... ఈ కొత్త చర్చ టీఆర్ఎస్ను బద్నాం చేసేందుకేనా... లేక తెర వెనుక అనూహ్య పరిణామాలేమైనా చోటు చేసుకుంటున్నాయా... వేచి చూడాల్సిందే.