కోర్టు ధిక్కరణలో నెక్ట్స్ ఎవరు ..? అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులు, పోలీసులకు ఇప్పటికే ఊరట
హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఇగ మిగిలింది మాజీ స్పీకర్ మధుసూదానాచారి. ఈ కేసులో ఇప్పటికే అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు ఊరట పొందారు. నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ పోలీసులకు ఊరట కలిగించే తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వారికి ఉపశమనం కలిగింది. ఈ ప్రక్రియలో న్యాయ, పోలీసు విభాగాలకు రిలీఫ్ కలుగగా .. ఇక మిగిలింది అప్పటి స్పీకర్ మధుసూదానాచారి.
ఎస్టీ 4, ఎస్సీ 6, బీసీ 6, ఆన్ రిజర్వ్ డ్ 16 ... తెలంగాణలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు
ఏం జరిగిందంటే ..
గతేడాది అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పీకర్ పై మైక్ విసిరేయడంతో అది మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తగిలింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సభ .. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా .. వారికి ఊరట కలిగింది. శాసనసభ నుంచి బహిస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. అయినా తీర్పును అమలుచేయలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేశాక కూడా ఎమ్మెల్యేల భద్రతను పునరుద్ధరించలేదు. ఈ అంశాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి .. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదులుగా డీపీజీ మహేందర్ రెడ్డి, నల్గొండ, జోగులాంబ ఎస్పీలు వెంకటరంగనాథ్, రాజేశ్వరి చేర్చింది. దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులు అప్పీల్ చేశారు.
అసెంబ్లీ రద్దుతో క్లోజ్ .. బెయిలబుల్ వారెంట్ తో మళ్లీ కోర్టుకు ...
అయితే అప్పటికే శాసనసభ రద్దవడంతో అప్పీలుపై విచారణను నిలిపివేస్తూ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం మూసివేత నిర్ణయాన్ని సింగిల్ జడ్జికి వదిలేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒకసారి ఫాం-1 నోటీసులు జారీచేశాక కోర్టుకు హాజరు కావాల్సిందేనని సింగిల్ జడ్జి బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యుల, న్యాయశాఖ కార్యదర్శి వి నిరంజన్ రావు హాజరయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ విడివిడిగా మరోసారి అప్పీల్ చేసి ... ఊరట పొందారు. ఈ కేసులో తమను కూడా విచారణకు పిలుస్తారని భావించిన డీజీపీ, ఎస్పీలు విడివిడిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ .. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పునివ్వడంతో వారికి ఊరట కలిగింది.
ఇక మిగిలింది మాజీ స్పీకరే ..?
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇక మిగిలింది అప్పటి స్పీకర్ మధుసూదానాచారే. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఇప్పటికే అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు ఊరట పొందగా .. బుధవారం డీజీపీ, ఎస్పీలకు ఉపశమనం కలిగింది. ఓ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తమను స్పీకర్ ఎలా సస్పెండ్ చేస్తారని .. సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా కేసు విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అమలుచేయని విభాగాల అధిపతులు స్టే తీసుకున్నారు. ఇక మిగిలింది స్పీకర్ ఒక్కరేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోటీసులు ఇస్తారా ..?
ప్రజాస్వామ్యంలో శాసన, న్యాయ వ్యవస్థలకు విశేష అధికారాలు ఉన్నాయి. మరి మాజీ స్పీకర్ ను కోర్టు విచారణకు హాజరుకావాలని పిలుస్తోందా ? అనే సందేహాం కలుగుతోంది. దీనిపై న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించి స్పీకరే బాస్ అని .. విశేష అధికారాలు ఉంటాయని చెప్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా తూచా తప్పకుండా పాటించాలని కొందరు వాదిస్తున్నారు. కోమటిరెడ్డి అండ్ కో విషయంలో హైకోర్టు తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి మరి.