టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎవరు..? టీడిపి మద్దత్తు పై నెలకొన్న ఉత్కంఠ..!!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు మరో సారి పునరావ్రుతం కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పోటీ లో ఉంటుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ప్రకటించడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఐతే తమ అభ్యర్థి గెలవాలంటే ఇంకా ఇద్దరు అభ్యర్థుల మద్దత్తు అవసరం కాగా టీడిపి ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరి టీడిపి నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దత్తు తెలుపుతారా..? అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు..! టీడిపి సపోర్ట్ తీసుకోనున్న కాంగ్రెస్..!!
వ్యూహాలు రచించడంలో కేసీఆర్ ని మించిన నాయకుడు ఉండడనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలంగాణాలో విజయవంతంగా రెండోసారి గులాబీ పార్టీని అదికారంలోకి తెచ్చిన చంద్రశేఖర్ రావు రాజకీయ స్కెచ్ వేశారంటే, అది వంద శాతం విజయవంతం కావాల్సిందే..! రెండోసారి అధికారం చేపట్టి రెండునెలలకు పైగా కేబినెట్ విస్తరణను వాయిదా వేసినా ఎక్కడా చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వక పోవడం చంద్రశేఖర్ రావు చతురతకు నిదర్శనం. అయితే ఇటీవలే 10 మంత్రులతో కేబినెట్ విస్తరణ చేసిన గులాబీ బాస్ ఇప్పుడు ఎమ్మెల్సీలపై దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
టీడిపి మద్దత్తపై ఉత్కంఠ..! కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు వేసిన స్కెచ్ ఆసక్తికరంగా మారింది. ఐదుగురు ఎమ్మెల్సీ సీట్ల ఈ ఎన్నిక కోసం నలుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. మరో సీటును ఎంఐఎంకు ఇచ్చారు. అయితే చంద్రశేఖర్ రావు వేసిన ఈ ఎత్తుగడతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వెంటనే అలర్ట్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించడంతో తమ మిత్రపక్షమైన టీడీపీ పార్టీతో కలిసి బరిలో దిగాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. టీడీపీ సహకరిస్తే ఎమ్మెల్సీ స్థానాన్ని సునాయసంగా గెలుపొందవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
టీడిపి మద్దత్తు తో బయటపడతామంటున్న కాంగ్రెస్..! ద్రుష్టంతా టీడిపి పైనే..!!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని మొదటి రౌండ్ లోనే కైవసం చేసుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ కు ఉంది 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అంటే ఇంకా ఇద్దరు కావాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు సపోర్ట్ చేస్తే సరిపోతుంది.
సండ్ర వెంకట వీరయ్య ఎటువైపు..? ఏ గట్టున నిలిస్తారు..?
కానీ ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ లభించని వారికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందట. అదిష్టానం నిర్ణయించిన అభ్యర్థి రంగంలో ఉంటాడని టీపిసిసి చెప్తున్నప్పటికి మర్రి శశిధర్ రెడ్డి పేరు బయటకు వినిపిస్తోంది.