బల్దియా పీఠం టీఆర్ఎస్దే: మేయర్ అభ్యర్ధి బరిలో ఉన్నది వీరే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలను చేసుకుంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు టపాసులతో సందడి చేసుకుంటున్నారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీని టీఆర్ఎస్ పార్టీ మెజార్టీని సాధించిన నేపథ్యంలో పార్టీ తరుపున మేయర్ అభ్యర్ధి ఎవరన్న విషయంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మేయర్ అభ్యర్ధిని ముందుగానే ప్రకటించినా, టీఆర్ఎస్ అలా చేయలేదు.
అయితే టీఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి మేయర్ అభ్యర్ధి బరిలో చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ మొత్తం ఏదో విధంగా తన పేరు వినిపించేలా, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలాను నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వచ్చిన సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు.
ఆమెకు కూడా సముచిత స్థానం ఇవ్వచ్చనే వాదన వినిపిస్తోంది. దీంతో ప్రధానంగా మేయర్ పదవి కోసం ఎక్కువ పోటీ వీరిద్దరి మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపిస్తుంది. ఇటీవలే జగదీశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు.
దీంతో ఇతనికి కాస్తంత అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేయడంతో సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. గ్రేటర్ ఫలితాలపై ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేసీఆర్ మేయర్ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.