గండ్ర ఎఫెక్ట్: రంగంలోకి కొండా, భూపాలపల్లిలో ఏం జరుగుతోంది?
వరంగల్: ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్లో చేరిన నేతలతో ఇంత కాలం పాటు పార్టీలో కొనసాగిన నేతలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఎవరికీ ఏ స్థానంలో టిక్కెట్టు దక్కనుందోననే విషయమై సస్పెన్స్ నెలకొంది. మరో వైపు టిడిపి నుండి గండ్ర సత్యనారాయణరావు టిఆర్ఎస్లో చేరడంతో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టార్గెట్ 2019: కెసిఆర్ ప్లాన్ ఇదే, సిట్టింగ్లకు గుబులు
2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ సీఎం కెసిఆర్ ఇప్పటి నుండే వ్యూహ రచన చేస్తున్నారు. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను టిఆర్ఎస్లో చేర్చుకొనే ప్లాన్ చేస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది.
గండ్ర Vs గండ్ర: అందుకే టిఆర్ఎస్లోకి, కొంపముంచిన రేవంత్
రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత టిడిపిలో బలమైన నేతలను కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వల వేశాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టిడిపి నేతలు ఆయా పార్టీలో చేరారు. అయితే టిడిపి నేత గండ్ర సత్యనారాయణరావు టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరారు.
భూపాలపల్లిలో ఏం జరుగుతోంది
సింగరేణి ఎన్నికల సమయంలోనే భూపాలపల్లి డివిజన్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఓటమిపాలైంది. ఈ డివిజన్లో ఎఐటియూసి విజయం సాధించింది. ఈ ఎన్నికల సమయంలోనే కరీంనగర్ ఎంపీ వినోద్తో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు మకాం వేసిన ప్రయోజనం లేకపోయింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పీకర్ మధుసూధనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే స్పీకర్ మధుసూధనాచారి సౌమ్యుడిగా పేరుంది. అయితే ఆయన తనయుల కారణంగానే నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనే ప్రచారం కూడ లేకపోలేదు.ఈ కారణంగానే గండ్ర సత్యనారాయణావును రంగంలోకి దించారనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే కెసిఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న మధుసూధనాచారిని కాదని ఇతరులను ఈ స్థానం నుండి పోటీకి దింపుతారా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే పార్టీ అవసరాల రీత్యా ఏ నిర్ణయమైనా తీసుకోనే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.
గండ్ర రాకతో మారుతున్న సమీకరణాలు
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో గండ్ర సత్యనారాయణరావు టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరడంతో సమీకరణాలు మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలో టిడిపిని బలోపేతం చేయడంలో గండ్ర సత్యనారాయణరావు కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన మత్స్యసంఘం ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో గణపురం సొసైటీని టిడిపి కైవసం చేసుకొంది. సింగరేణి ఎన్నికల్లో ఎఐటీయూసీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే గండ్ర సత్యనారాయణరావును టిఆర్ఎస్లో చేర్చుకొన్నారని అంటున్నారు.
గండ్ర వెనుక కడియం, ఎర్రబెల్లి
గండ్ర సత్యనారాయణరావు టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరడం వెనుక డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి , పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు గండ్ర వెంకటరమణారెడ్డిని కాదని గండ్ర సత్యనారాయణరావుకు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో రేవంత్ రెడ్డి వెంట గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఆయన టిఆర్ఎస్లో చేరారు. అయితే గండ్ర సత్యనారాయణరావు టిఆర్ఎస్లో చేరడానికి వ్యూహత్మకంగా కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు పావులు కదిపారనే ప్రచారం కూడ లేకపోలేదు.
కొండా మురళి కూడ రంగంలోకి
2014 ఎన్నికల సమయంలో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొండా మురళి మధుసూధనాచారి విజయం కోసం కృషి చేశారు. భూపాలపల్లిలో కొండా మురళి అనుచరులు కూడ చాపకింద నీరులా పనిచేసుకొంటు పోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళి బర్త్ డేను గ్రాండ్ గా జరుపుకోవడం, మహిళలకు లక్ష చీరెల పంపకాన్ని చేపట్టారు. 2019 ఎన్నికల్లో తనకు కానీ, తన కూతురుకు కానీ, ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇవ్వాలని కొండా మురళి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ను కోరినట్టు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తే 2019 ఎన్నికల్లో ఎవరికీ ఈ స్థానం నుండి టక్కెట్టు దక్కనుందనే విషయమై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.