సనత్ నగర్ లో సంబురాలు ఎవరికో..? మారిన ఓటర్ల నాడి..! ఏ పార్టీకి పడుతుందో పిడి..!!
హైదరాబాద్ :ముందస్తు ఎన్నికల ప్రకటన నాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు ఎంతో తేడా ఏర్పడింది. రోజురోజుకు అత్యంత వేగంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కాగా తెలంగాణలో కీలకంగా ఉన్న సనత్నగర్ నియోజకవర్గం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సనత్ నియోజకవర్గానికి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే..! గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన తలసాని ఆ తరువాత తలెత్తిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీఆర్ఎస్లో చేరారు. దీనికితోడు ఆయన మంత్రి పదవిని చేపట్టడంపై ప్రతిపక్షాల విమర్శలకు ఆయన కేంద్రబిందువుగా మారాడు.
మహాకూటమి ఆవిర్బావంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో బెంగ..! గెలుపుపై కసరత్తు షురూ.!!
తెలంగాణలో రాజకీయాలు రానురాను మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మహాకూటమి ఆవిర్బావంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో లోలోపల భయంపుట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా కేంద్ర స్థాయిలో చక్రం తిప్పుతుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలంతా కీలక నియోజకవర్గాల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు అన్ని పార్టీల ప్రచారాలు మొదలై ముమ్మరంగా సాగుతున్నా, ప్రజానాడి తెలియక రాజకీయ నేతలు సతమతవుతున్నారని తెలుస్తోంది.
Recommended Video
తలసానికి ఎదురీత తప్పదు..! సనత్ నగర్ లో మారిన సీన్..!!
టీడీపీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ను టీఆర్ఎస్ లో ఎలా చేర్చుకుంటారని, పైగా మంత్రిని ఎలా చేస్తారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని బాహాటంగానే తెలుగు తమ్ముళ్లు విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మరోమారు సనత్నగర్ నియోజక వర్గం హాట్ టాపిక్గా పరిణమించింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ఆశావాహులు ఇదే సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపించడం ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్తో టీడీపీ జట్టుకట్టిన క్షణం నుండి తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది.
సెటిలర్స్ ఎక్కువే..! కాని ఏ పార్టీని ఆదరిస్తారో అంచనావేయలేని పరిస్థితి..!
మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు జరగకపోవడంతో ఆశావహులు ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. రేపే మాపో టిక్కెట్ల సద్దుబాటు జరుగుతుందని సమాచారం. కాగా సనత్నగర్ నుంచి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగేందుకు మర్రి శశిధర్రెడ్డి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ పడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో కూన వెంకటేష్ గౌడ్ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లను ప్రసన్నం చేసుకునే పనిలోవున్నారని తెలుస్తోంది. దీనికితోడు కూన వెంకటేష్ గౌడ్ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా 2014లో చివరి వరకూ సనత్ నగర్ బరిలో ఉన్న ఆయన తుది నిమిషంలో సీటును త్యాగం చేసుకోవాల్సి వచ్చింది.
టీడిసి సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీ కే అవకాశాలు ఎక్కువ అంటున్న స్థానికులు..!
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆభ్యర్థిస్తున్న మర్రి శశిధర్రెడ్డికి అధిష్టానం ఇంకా ఎటువంటి సూచనలు చేయకపోండంతో ప్రచారానికి దిగడం లేదు. దీనికితోడు ఇదే నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసేందుకు బండారు దత్తాత్రేయ కుమారుడు ప్రదీప్కుమార్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఎటు చూసినా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి హేమాహేమీలంతా బరిలోకి దిగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇలాంటి బలమైన పోటీదారులతో తలపడేందుకు సిద్దమవుతున్న సిట్టింగ్ ఎమ్మల్యే తలసానికి కాలం కలిసొస్తుందా అనే అంశం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.