మహాకూటమి ఎందుకు..? ప్రశ్నిస్తున్న రాములమ్మపై టీపిసీసీ కన్నెర్ర..!!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొంత అసంత్రుప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీలో ఉన్నా సరైన పదవి ఇవ్వలేదని అదిష్టనం పై ఆగ్రహంగా ఉన్న రాములమ్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా ఇటీవల ఎఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ రాములమ్మకు ప్రచార కమిటీలో కీలక బాద్యతలను అప్పజెప్పారు. ఐనప్పటికి ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అంతే అసహనంగా ఉన్నారు శాంతి మేడమ్. తెలంగాణలో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయి గాని పొత్తులే వెళ్తే ప్రయోజనం ఉండదంటూ వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు విజయశాంతి. దీంతో టీపిసిసి నేతలు కొందరు రంగంలోకి దిగి రాములమ్మకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు గాందీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.
కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న విజయశాంతి..! పదవి రాలేదని ఆగ్రహం..!!
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాక సైలంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏమైందోకానీ రాములమ్మ మాత్రం పొలిటికల్ స్క్రీన్పై కనుమరుగయ్యారు. చాలా రోజుల తర్వాత బోనాల పండుగ సమయంలో తిరిగి వచ్చారు. హైదరాబాద్లోని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.ఇక అప్పటి నుంచి ఈ లేడీ అమితాబ్ మళ్లీ కాంగ్రెస్లో చురుగ్గా పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇప్పుడు పదవి వచ్చినా మరో వేదన..! కూటమి ఎందుకంటున్న రాములమ్మ..!
ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో విజయశాంతి కనిపించకపోవడం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరిచింది.తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుతోంది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాని పార్టీ, ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీకి సీనియర్ నేతల అవసరం చాలా ఉంది. అందుకే రాములమ్మను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు సంప్రదించింది.
మహాకూటమి కర్తవ్యం ఏంటి..? ప్రశ్నిస్తున్న రాములమ్మను బుజ్జగిస్తున్న నేతలు..!!
అయితే, ఆమె కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు ఏ పదవి ఇవ్వలేదనే కారణంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆమె గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కోరినా అధిష్టానం ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు ఈ మద్య కాలం వరకు పీసీసీ తెలంగాణ కమిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదు. దీంతో అలక బూనిన రాములమ్మ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. కీలక సమయంలో ఆమె అవసరాన్ని గ్రహించిన కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం ప్రకటించిన కమిటీలో రాములమ్మకు కీలక పదవి కట్టబెట్టింది. టీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్గా విజయశాంతి నియమించారు.
వ్యతిరేక గళం విప్పొద్దు...! లేడీ అమితాబ్ కి గట్టి హెచ్చరికలు..!!
దీంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ తరుపున క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేలా చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో అదే మెదక్ జిల్లాలో ఏదో ఒక నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న విజయశాంతికి ఈ విధంగా చెక్ పెట్టారని గాంధీభవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ పొత్తు విషయమై ఆమెతో ఏఐసీసీ కార్యదర్శులు సుదీర్ఘంగా చర్చినట్లు తెలుస్తోంది. పొత్తుల విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని, ఒకవేళ ఏదైనా నెగటీవ్ అభిప్రాయం ఉన్నా బహిరంగంగా ప్రకటించవద్దని కూడా సూచించినట్టు తెలుస్తోంది.