ఈ కూలగొట్టుడేంది ? జగన్ కు ఎవరైనా మంచి సలహాలు ఇవ్వండయ్యా అంటున్న వీహెచ్
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హన్మంత రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తన తండ్రికి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని మర్చిపోరాదని ఆయన పేర్కొన్నారు. జగన్ కు ఎవరైనా మంచి సలహాలు ఇవ్వాలని సూచించిన వీ హన్మంతరావు ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్ కూల్చివేత నిర్ణయం సరికాదని సూచించారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని హితవు పలికారు వీహెచ్ .
రాజీవ్ మెమోరియల్ భవన కూల్చివేత నిర్ణయంపై ఫైర్ అయిన వీహెచ్
కాంగ్రెస్ పార్టీలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేసిన సమయంలో రాజీవ్ గాంధీ వల్లే వైయస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ అయ్యారు కాబట్టే ఆ తర్వాత ముఖ్యమంత్రి కాగలిగారని వీహెచ్ పేర్కొన్నారు. ప్రజలు ఎంతగానో నమ్మి మీకు అవకాశం ఇస్తే ఈ కూల్చుడు ఏంటయ్యా అంటూ ప్రశ్నించారు. వైఎస్ ఏది చెయ్యగలిగినా అదంతా రాజీవ్ గాంధీ చలవేనని చెప్పుకొచ్చారు వీహెచ్ . అలాంటి వ్యక్తి గుర్తుగా ఉన్న రాజీవ్ మెమోరియల్ భవనాన్ని కూల్చి వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో కక్ష సాధింపులు పనికిరావన్న వీహెచ్ .. నువ్వేం పర్మినెంట్ కాదని మండిపాటు
రాజీవ్ గాంధీ మీద , ఆయన జ్ఞాపకార్ధం నిర్మించిన స్మృతి భవన్ మీద కక్ష సాధింపులు దేనికి అని ప్రశ్నించారు. ఎవరికీ పదవులు శాశ్వతం కాదని, జగన్ కూడా తాను సీఎంగా పర్మినెంట్ గా ఉంటానని భావిస్తున్నారని కానీ ఎవరికీ ఏది పర్మినెంట్ కాదని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజీవ్ మెమోరియల్ భవన్ కూల్చివేతకు పాల్పడితే అభిమానులు చూస్తూ ఊరుకోరని వీహెచ్ హెచ్చరించారు . జగన్ తన వైఖరి మార్చుకోవాలని పేర్కొన్న వీహెచ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ దయాదాక్షిణ్యాలతోనే రాజకీయాల్లో ఎదిగారని గుర్తు చేశారు.
రాజీవ్ గాంధీ చలవే వై ఎస్ సీఎం కావటం అన్న వీహెచ్ .. కూల్చుడు కాకుండా జగన్ కు మంచి సలహాలు ఇవ్వండని సూచన
వైయస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఆనాటి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా తాను మాత్రం మద్దతు పలికానని తెలిపారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఒప్పించి పీసీసీ చీఫ్ గా వైయస్ రాజశేఖర్ రెడ్డిని నియమించుకున్నామని తెలిపారు. సోనియాగాంధీ దయతోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారని ఆ విషయాన్ని వైయస్ జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కూల్చివేత నిర్ణయం మార్చుకోవాలని ఆయన కోరారు. రాజకీయాల్లో కక్ష సాధింపు మంచిది కాదని , వైసీపీలో ఉన్న నాయకులు జగన్ కు మంచి సలహాలు ఇవ్వాలని వీహెచ్ సూచనలు చేశారు. ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలని , రాజకీయాల్లో రివెంజ్ లకు చెక్ పెట్టాలని చెప్పిన వీహెచ్ రాజీవ్ మెమోరియల్ భవన్ కూల్చివేత వ్యవహారం పార్లమెంట్ లో కూడా చర్చకు పెట్టాలని కోరారు.