మా దారిలో రాకుంటే.. బాబు ఫ్రంట్ గొడవ!: నిన్న పవన్ కళ్యాణ్-జగన్, నేడు కేసీఆర్!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు.. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ బీజేపీని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, వైసీపీ అధినేత వైయస్ జగన్ను టార్గెట్ చేస్తున్నారు. నిత్యం మోడీ, సీనియర్ మోడీ (కేసీఆర్), జూనియర్ మోడీ (జగన్)లు ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే: వైయస్ రాజశేఖర రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు
మోడీపై ప్రశంసలు, ఎన్నికలకు ముందు ఇలా
మోడీ, కేసీఆర్లను టార్గెట్ చేయడం చూస్తుంటే నేను చెప్పిందే వేదం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉన్నారు. హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని చెప్పారు. ఇటీవల హోదా కావాలని మళ్లీ అంటున్నారు. ఏపీకి మోడీ చేసినంత ఎవరూ చేయలేదని కూడా అన్నారని గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్లు ఇలా మాట్లాడి, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదేం విచిత్రం.. నాలుగేళ్లు అలా చెప్పి, ఇప్పుడు కలిసి రావడం లేదని..
ముఖ్యంగా కేసీఆర్ విషయంలో చంద్రబాబు తీరు.. విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఎన్నో తెరాసతో పాటు ఏపీలోని విపక్షాలు ఉదాహరణలు చూపిస్తున్నాయి. జగన్, పవన్ కళ్యాణ్లు హోదా కోసం గళమెత్తినప్పుడు చంద్రబాబు జైల్లో పెట్టిస్తానని చెప్పారని, ప్యాకేజీ బాగుందని అన్నారని, ఇప్పుడు ఆయన హోదా అంటున్నారని గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు హోదా మాట ఎత్తకుండా ఇప్పుడు చంద్రబాబు ఆ లైన్ తీసుకొని, పవన్, జగన్లు తమతో కలిసి రావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
కేసీఆర్ ఫ్రంట్ పై విమర్శలు
కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ఫ్రంట్ను తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. 36 ఏళ్ల రాజకీయ వైరాన్ని, తెలుగు గౌరవాన్ని పక్కన పెట్టి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశారని విపక్షాలు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. ఈ కూటమి కేసీఆర్కు షాకిస్తుందని భావించారు. కానీ టీఆర్ఎస్ అనూహ్య విజయం సాధించింది. కేసీఆర్ ఫ్రంట్ భవిష్యత్తు పక్కన పెడితే, తెలంగాణలో మహాకూటమి ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. మహాకూటమి అయినా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అయినా ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు అంటున్నారు.
మాతో వస్తే సరి లేదంటే
కాబట్టి కూటమి లేదా ఫ్రంట్లు ఎవరివి విజయవంతమవుతాయో, ఎవరివి ఫెయిల్ అవుతాయో చెప్పలేమని అంటున్నారు. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం బీజేపీయేతర కూటమిలోకి కేసీఆర్ వస్తేనే సరి అన్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు. కేసీఆర్ థర్ట్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విపక్ష ఓట్లను చీల్చేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది. మా కూటమిలోకి వస్తే సరి లేదంటే బీజేపీకి అనుకూలమే అన్నట్లుగా మాట్లాడటాన్ని టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు.
కాంగ్రెస్తో కలవడం కోసం టీడీపీకి అవసరం కావొచ్చు
36 ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో కలవడం టీడీపీకి అవసరం కావొచ్చునని, కానీ టీఆర్ఎస్ పార్టీకి ఆ అవసరం లేదని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెడితే (తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు) మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పైన టీడీపీ పోరాటం చేసిందని చెబుతున్నారు. 2004లో తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో తెరాస పొత్తు పెట్టుకున్నట్లే, హోదా కోసం టీడీపీ పొత్తు పెట్టుకొని ఉంటే తమకు అభ్యంతరం లేదని అంటున్నారు.
మా దారిలో రాకుంటే తప్పే!
కానీ 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఎంతో నష్టం జరిగిందని, అలాగే ఈ అయిదేళ్ల బీజేపీ పాలనలో ఒరిగిందేమీలేదని, అందుకే తాము బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అంటున్నామని టీఆర్ఎస్ చెబుతోంది. హోదా విషయంలో జగన్, పవన్ కళ్యాణ్లను కలిసి రమ్మని చెప్పినా, దేశవ్యాప్తంగా ఫ్రంట్ విషయంలో కేసీఆర్ పైన విమర్శలు గుప్పించినా.. టీడీపీ తీరు తమ దారిలో రాకుంటే తప్పే అన్నట్లుగా మాట్లాడుతోందని జనసేన, వైసీపీ, టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి ద్వారా జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనే ఆలోచన లేదంటే ఆ పార్టీలు కాకుండా కొత్త కూటమి ఢిల్లీలో అధికారంలో ఉండాలనే కేసీఆర్ ఆలోచనను తప్పుబట్టడం ఏమిటని అంటున్నారు.