కాంగ్రెస్ పరిస్థితే ఎందుకిలా? ఇలాగే కొనసాగితే మరో 'బిగ్ డ్యామేజ్'
హైదరాబాద్ : విషయమేదైనా.. దాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగేది మీడియా మాత్రమే. మీడియా ఫోకస్ లేనిచోట ఎంత పెద్ద విషయమైన ప్రచారానికి నోచుకోదు. జనం చెవిన పడితేనే కదా.. దేని మీదైనా చర్చ..! అదే లేనిచోట ఎంత తిమ్మిని బమ్మిని చేసే చర్య అయినా మరుగునపడిపోవాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దిగాలుకు ఇదంతా నిదర్శనం.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్-టీడీపీలది ఇంచుమించు ఒకే పరిస్థితి. అధికార పార్టీ దెబ్బకు గత రెండున్నరేళ్లలో రెండూ పార్టీలు కుదేలయ్యాయి. అయితే ఒకరిద్దరు నేతలకే పరిమితమైపోయిన టీడీపీతో పోలిస్తే.. కాంగ్రెస్ ఒకింత బెటర్ అనే అనవచ్చునేమో! కానీ మీడియా ఫోకస్ విషయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీకి ఉన్న ప్రాచుర్యం కూడా కాంగ్రెస్ లేకపోయిందని ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ చేపడుతోన్న కార్యక్రమాలకు మీడియాలో అంతగా చోటు దక్కట్లేదని కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రతీ పార్టీ మీడియా మేనేజ్ మెంట్ చేస్తోన్న ఈరోజుల్లో కాంగ్రెస్ మాత్రం అందుకు దూరంగానే ఉండిపోయింది. ఆఖరికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది.
పరిస్థితి ఇలాగే గనుక కొనసాగితే.. ఇప్పటికే ఢీలా పడ్డ కాంగ్రెస్ రాజకీయాలు 2019 ఎన్నికల నాటికి అసలు అడ్రస్ లేకుండా పోతాయనే వాదన కూడా లేకపోలేదు. ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను భుజానెత్తుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు అసలు ఆ దిశగా ఫోకస్ చేస్తున్నారా? అన్నది అనుమానమే. అందుకే అటు ప్రింట్ మీడియాలోను, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలోను కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టుగానే తయారైంది.
మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి అటు సోషల్ మీడియాలోను, ఇటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలోను దూసుకెళుతోంది. ఇక టీడీపీకి కూడా అనుకూల మీడియా ఉంది కాబట్టి కాస్తో కూస్తో ఆ పార్టీ పరిస్థితి కూడా పరవాలేదనే చెప్పాలి. దీంతో ఎటుతిరిగి బాధంతా కాంగ్రెస్ పార్టీకే. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారడం మాత్రం ఖాయం. ఇలాంటి తరుణంలో.. సొంత మీడియా దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు జరుగుతాయా? లేక ఇప్పుడున్న మీడియానే కాంగ్రెస్ నేతలు మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.