రైల్వే కొత్త లైన్ల మంజూరులో ఎందుకు వివక్ష.?కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినోద్ లేఖ.!
హైదరాబాద్ : రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణకు రైల్వే కొత్త లైన్ల మంజూరు చేసే విషయంలో న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినోద్ కుమార్ గురువారం లేఖ రాశారు.
తెలంగాణ పట్ల వివక్ష.. రైల్యే లైన్లు ఎందుకు మంజూరి చేయడం లేదన్న వినోద్ కుమార్
రానున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లోనైనా తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని వినోద్ కుమార్ ఆ లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ట్రం అని, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారని, దీంతో రైల్వే రవాణాకు ప్రాధాన్యత చేకూరుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రైల్వే లైన్లు మంజూరి చేయండి.. కేంద్ర రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ..
దీనికి తోడు ఇతర రాష్ట్రాలకు గతంలో వలస వెళ్లిన తెలంగాణవాసులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు, విద్యుత్ లభ్యత ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్ల స్వరాష్ట్రానికి ప్రజలు తిరిగి రావడానికి కారణం అని వినోద్ కుమార్ వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, అందు కోసం రైల్వే కొత్త లైన్లను మంజూరు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
రానున్న రైల్వే బడ్జెట్ పొందుపరచండి.. తెలంగాణకు న్యాయం చేయాలన్న వినోద్ కుమార్
తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ మాత్రమే మంజూరు అయిందని, అదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని సమకూర్చి మూడో వంతు నిర్మాణ ఖర్చును భరించినందుకే ఆ రైల్వే లైన్ వచ్చిందని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం 13 వ సెక్షన్ ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆరు నెలల కాలంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికి.. అది ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయిందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతోంది.. కేంద్రం తగిన చేయూత అందివ్వాలన్న వినోద్
రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పితే రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఏవో కుంటి సాకులు చెబుతూ కేంద్ర రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కన పెట్టిందని వినోద్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు.