జగన్, కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా ? తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు దానికి సంకేతమా ?
హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల రణస్థలం ప్రక్రియ ప్రారంభమైంది. సీట్లు, నామినేషన్లు, బుజ్జగింపుల పర్వంతో అధినేతలు బిజీగా ఉండనుంటే .. ప్రచారంతో దేశంలోని వీధులు మారుమోగనున్నాయి. తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 11న పోలింగ్. అంటే సరిగ్గా నెలరోజుల్లో నేతల భవితవ్యాన్ని ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తారు. గత ఎన్నికల్లో చివరి విడుతలో జరిగిన ఎన్నికల క్రతువు .. ఈసారి మొదటి ఫేజ్ కి రావడంలో కారణమేంటీ ? కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ చేసిన విజాపనలు ఫలించనట్టేనా ? ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఓకేసారి పోలింగ్ జరుగనుండటంలో ఆంతర్యం ఏంటీ ?
మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
తుది నుంచి తొలి విడత
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ అసెంబ్లీతోపాటు పార్లమెంట్ ఎన్నికలు చివరి విడుత జరిగాయి. ఆ తర్వాత 2014 మే 16న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ ఈసారి సీన్ రివర్సైంది. తుది విడుత పోలింగ్ కాస్త .. ఫస్ట్ ఫేజ్ కి వచ్చింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరుగనుండగా .. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే తుది విడత నుంచి తొలి విడుత ఎన్నికలు జరగడానికి మాత్రం ఈసీకి కేసీఆర్, జగన్ విన్నవించడమేననే చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్, వైసీపీ వాదన ఏంటీ ..?
తెలుగురాష్ట్రాల్లో ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్, వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజప్తి చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ద్వంద్వ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని భావించాయి. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి వైసీపీ అధినేత జగన్ విన్నవించారు. ఈ సమస్యను కేంద్ర ఎన్నికల సంఘం .. తెలుగురాష్ట్రాల సీఈసీలతో సంప్రదింపులు జరిపింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గమనించి .. ఓకేసారి నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ద్వంద్వ ఓటింగ్ కు అవకాశం ఉండదని సీఈసీ భావించింది. దాంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఓకేసారి .. అది కూడా ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ చేర్చినట్టు సమాచారం. ఇటు కేసీఆర్ కూడా ఓట్ల గల్లంతు, బోగస్ ఓట్లపై సీఈసీ దృష్టికి తీసుకెళ్టినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.
ఆ పార్టీల వినతికి స్పందన .. కారణం ఇదేనా ..?
తెలుగురాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్, వైసీపీ చేసిన అభ్యర్థనకు కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. వారి మొర ఆలకించి .. ఒకే విడత ఎన్నికలు నిర్వహిస్తూ .. షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఆ పార్టీల ఆరోపణలు నిజమా ? లేదంటే బీజేపీతో ఆ రెండు పార్టీలకున్న సత్సంబంధాల కారణంగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం నడుచుకుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వివిధ అంశాలపై ఇప్పటికే ఈ రెండు పార్టీలపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కూడా బీజేపీ మద్దతుతోనే అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.
ఇప్పుడే కాదు .. గతంలో కూడా ...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలలో కాక గతంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించింది. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ ఫార్వార్డ్ బ్లాక్ గుర్తు .. తమ కారు గుర్తును పోలి ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది. అందుకోసం 15 సీట్లలో ఓడిపోయామని వెల్లడించింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు, ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. సీఈసీతో ప్రత్యేకంగా సమావేశమై .. ఎస్పీ ఫార్వార్డ్ బ్లాక్ గుర్తు తీసేయాలని కోరారు. ఇందుకు సీఈసీ సానుకూలంగా స్పందించింది. ఓ రాజకీయ పార్టీ అభ్యంతరాలకు సీఈసీ .. అంగీకరించడం అత్యంత అరుదు. అప్పట్లో ఈ అంశంపై చర్చ కూడా జరిగింది. దీని వెనుక కూడా కేంద్ర పెద్దల ప్రమేయం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ, ఏపీ పార్లమెంట్ స్థానాల్లో ఓకేసారి జరుగడం ఆలోచింపజేస్తోంది.