చంద్రబాబుతో రాజీ: కెసిఆర్ వెనక జరిగిందేమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య రాజీ కుదరడం వెనక పనిచేసిన శక్తులేవి, ఆ రాజీ వల్ల సంభవించే పరిణామాలేమిటనేది ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనివార్యమైన స్థితిలోనే ఇరువురు కూడా రాజీకి అంగీకరించినట్లు భావిస్తున్నారు.
ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య స్నేహం పొడిచినందుకు కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ మాత్రమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ రాజీ వల్ల ఎక్కువగా ఆనందపడింది వారేనని వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ పదే పదే చేసిన ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు తీవ్రమైన హెచ్చరికలు చేసిన కెసిఆర్ చంద్రబాబుకు స్నేహహస్తం అందించారు. అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ను ఆహ్వానించడం దగ్గర నుంచి వేదిక మీద ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం వరకు చంద్రబాబు చాలా జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన కెసిఆర్కు ఒక రకంగా మోడీ నుంచి, చంద్రబాబు నుంచి అపూర్వమైన ఆదరణే లభించింది. కెసిఆర్ వేదికపై చాలా క్లుప్తంగానే అయినా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ ప్రసంగించారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు టి. జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య రాజీ కుదిర్చిన మధ్యవర్తి తమకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు బయటపెడుతామని మరో తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు కెసిఆర్తో రాజీకి వచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి కెసిఆర్, ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు బయటపడడానికి ఇరువురు రాజీకి వచ్చారని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఓటుకు నోటు కేసు అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో తెలంగాణ ఎసిబి తన దూకుడు తగ్గించినట్లు స్పష్ఠంగానే అర్థమవుతోంది. కాగా, ఇటీవల అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. అది సిబిఐ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను ప్రశ్నించడం. ఇది అత్యంత గోప్యంగా జరిగినప్పటికీ మీడియాకు తెలిసిపోయింది.
ఈసిఐ ఆస్పత్రి నిర్మాణంలో అక్రమాలపై సిబిఐ కెసిఆర్ను ప్రశ్నించినట్లు చెబుతున్ారు. ఈ కుంభకోణం కెసిఆర్ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిగా ఉన్నప్పుడు 2006లో జరిగింది. ఈ కుంభకోణంలో కెసిఆర్ పాత్రపై సిబిఐ అధికారులు కెసిఆర్ను ప్రశ్నించారని అంటున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ మోడీతోనూ చంద్రబాబుతోనూ సయోధ్యకు రాక తప్పలేదనే మాట వినిపిస్తోంది. ఏమైనా, రాజకీయంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాజీకి రావడం వెనక బలమైన శక్తులే పనిచేశాయని అంటున్నారు.
చంద్రబాబు మెట్టు దిగి కెసిఆర్తో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి రావడంతో పాటు కెసిఆర్ కలిసి పనిచేయాల్సిన అనివార్యతలో పడ్డారని అంటున్నారు. చంద్రబాబు తనకు సమానమైన గౌరవం, మర్యాద ఇవ్వడం వల్ల వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో తనకు లాభుపడుతుందని, తెలంగాణలోని సెటిలర్లు తనకు అనుకూలంగా మారుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.