అందుకే పవన్ కళ్యాణ్కు కేసీఆర్ దూరమా, ఆ ఆశలపై జనసేన నీళ్లు చల్లుతుందా?
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఢిల్లీస్థాయిలో ఎన్డీయే, యూపీఏలకు సరైన మెజార్టీ రాకుంటే చక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు. ఏ పార్టీకి 200 సీట్లు మించి రావని తెరాస నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొరుగు తెలుగు రాష్ట్రం ఏపీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఢిల్లీస్థాయిలో కీలకంగా మారాలని భావిస్తున్నారు.
ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసాని
వైసీపీని ఎంచుకోవడం వ్యూహాత్మకమేనా?
థర్డ్ ఫ్రంట్ పైన ఇప్పటికే తెరాస నేతలు... వైసీపీ అధినేతను కలిశారు. కేసీఆర్ కూడా కలుస్తారని చెప్పారు కానీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. గతకొన్నాళ్లుగా టీడీపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య పోటా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ, జనసేనను కాకుండా వైసీపీని ఎంచుకోవడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
అసెంబ్లీ కాదు.. లోకసభ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య గట్టి పోరు నెలకొని ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య రసవత్తర పోరు ఉండగా, ఎన్నికల అనంతరం జనసేన కీలకం కానుందని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా, ఎవరికి మెజార్టీ రాకుండా జనసేన చక్రం తిప్పినా.. తెరాసకు ప్రాధాన్యతాంశం కాదని చెబుతున్నారు. వైసీపీయే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. 25 స్థానాలకు గాను టీడీపీకి 4 నుంచి 11, వైసీపీకి 13 నుంచి 21 సీట్లు వస్తాయని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ కంటే జగన్ అవసరం
ఎన్డీయే, యూపీఏలకు మెజార్టీ సీట్లు రాకపోతే, థర్డ్ ఫ్రంట్ ద్వారా చక్రం తిప్పవచ్చునని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరిపారు. టీడీపీతో రాజకీయ విభేదాలు ఉన్నందున ఆ పార్టీకి దూరం పాటిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటినప్పటికీ లోకసభ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల వలె సత్తా చాటకపోవచ్చునని తెరాస భావిస్తోందని అంటున్నారు. అందుకే థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్.. జగన్ వైపు చూశారని భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సీట్ల లెక్కలు పక్కన పెట్టి, లోకసభ సీట్ల ఆధారంగా కేసీఆర్ లెక్కలు వేసుకొని ఉంటారని, ఈ లెక్కన పవన్ కంటే జగన్ అవసరం ఉంటుందని భావించి ఉంటారని అంటున్నారు.
ఆశలపై నీళ్లు జల్లుతుందా?
కానీ, ప్రీపోల్ సర్వేలు జనసేనను అంతగా పరిగణలోకి తీసుకోలేదు. జనసేన లోకసభ సీట్లు ఎన్ని గెలుస్తుందనే విషయాన్ని పక్కన పెడితే, టీడీపీ, వైసీపీ గెలుపోటములను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ 'థర్డ్' ఆశలకు పవన్ కళ్యాణ్ గండి కొడతారా అనే చర్చ సాగుతోంది. ఎన్డీయే, యూపీఏ కూటములకు మెజార్టీ రాకుండా ఒక్క లోకసభ స్థానం కూడా కీలకమే. అందుకే తెలంగాణలో 16 సీట్లను తెరాస టార్గెట్గా పెట్టుకుంది. ఏపీలోను వైసీపీ ఎన్ని ఎక్కువ స్థానాల్లో గెలిస్తే అంత మంచిదని తెరాస భావిస్తోంది. కానీ జగన్, కేసీఆర్ ఆశలపై జనసేన నీళ్లు జల్లుతుందా, లేదా చూడాలని అంటున్నారు.