ఆ హమీని కెసిఆర్ నెరవేర్చలేదు, దళిత ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయించారు: ఉత్తమ్
హైదరాబాద్: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కెసిఆర్ తుంగలో తొక్కారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయించి దళితులపై తనకు ఏ పాటి ప్రేమ ఉందో కెసిఆర్ నిరూపించుకొన్నాడని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.
దళితులపై దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో భాగంగా హైద్రాబాద్ గాంధీభవన్ ఎదుట సోమవారం నాడు జరిగిన దీక్షలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ కుంతియాతో పాటు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు , ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అనేక దాడులు చోటు చేసుకొన్నాయని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. వందలాది మంది దళితులను బిజెపి పొట్టనపెట్టుకొందన్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ మార్చిపోయారని గుర్తు చేశారు. మంథనిలో దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉందన్నారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ కాగితాలకే పరిమితమైందన్నారు. . శాసనసభలో దళితుల గురించి మాట్లాడకుండా దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయించారని ఆయన ఆరోపించారు.
టిడిపి, టిఆర్ఎస్, వైసీపీలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. విభజించు పాలించు అనే సిద్దాంతం ఆధారంగా మోడీ పాలన సాగిస్తున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. బ్రిష్ విధానాన్ని ఆయన అమలు చేస్తున్నాడన్నారు. అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని అన్నారు. బీజేపీ దళితులను, మైనారిటీలను ద్వేషిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుందని చెప్పారు.