రాష్ట్రపతి ఎన్నికలు-విభజన కారణం: జగన్-కేసీఆర్లు ఇలా షాకిచ్చారు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతివ్వాలని ముందే నిర్ణయించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్, జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తాజాగా ట్విస్ట్ ఇచ్చాయి.
హైదరాబాద్/అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతివ్వాలని ముందే నిర్ణయించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్, జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాయి.
చదవండి: మాట్లాడేందుకు ప్రయత్నించాం, కానీ, మద్దతుకోసం కెసిఆర్ కు లేఖ: మీరాకుమార్
ఆరెస్సెస్ వాది, బిజెపి నేత అయిన రామ్నాథ్కు టిఆర్ఎస్, వైసిపిలు మద్దతివ్వడం సరికాదని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆరెస్సెస్ వ్యక్తికి జగన్ మద్దతివ్వడం సరికాదని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతుంటే, తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన మీరా కుమార్కు కేసీఆర్ మద్దతివ్వాలని టి కాంగ్రెస్ అంటోంది.
మాట్లాడకుండా జగన్, కేసీఆర్ పార్టీలు..
అయితే, వీరికి టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నాయి. తద్వారా కాంగ్రెస్ పార్టీని మాట్లాడలేని పరిస్థితుల్లోకి నెట్టివేసే ప్రయత్నాలు చేశాయి.
అందుకే మీరాను తీసుకొచ్చారు
ఎన్డీయేనే మొదట దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని, పైగా కేసీఆర్ సూచన మేరకు కూడా రామ్నాథ్ వంటి నేతను నిలబెట్టినట్లు స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని తెరాస నేతలు అంటున్నారు. మోడీ దళిత నేతను నిలబెట్టిన తర్వాత విపక్షాలు కూడా కౌంటర్గా మీరా కుమార్ను తెరపైకి తెచ్చాయంటున్నారు.
సమాధానం ఏది?
అంటే మోడీ ఏ సామాజిక వర్గం నేతను నిలబెడితే, ఆ సామాజిక వర్గం నేతను నిలబెట్టాలనేది కాంగ్రెస్, విపక్షాల ఆలోచననా అని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ముందుగా తమను ఎందుకు సంప్రదించలేదని నిలదీస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నుంచి సమాధానం లేదని అంటున్నారు.
విభజన.. ఇదీ మా కారణం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడలేని కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర విభజనలో మీరా కుమార్ పాత్ర వహించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, విభజనలో పాత్ర పోషించిన వ్యక్తికి తాము ఎందుకు మద్దతివ్వాలని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. టిఆర్ఎస్, వైసిపి నేతల ఎదురుదాడికి కాంగ్రెస్ వద్ద సమాధానం లేదని అంటున్నారు.